తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ ఎం జరుగుతుందో అర్ధం కాని పరిస్దితుల్లో ప్రజలు వున్నారు. తాజాగా టీఎస్ ఆర్టీసీ సమ్మె విరమించి విధుల్లోకి వస్తారని ప్రజలు ఆశించారు. కాని సమ్మె మరింతగా జటిలమవుతూ రోజు రోజుకు సమస్యలను సృష్టిస్తుందని ఊహించలేక పోయారు. ఈ సమ్మె ప్రభావం ప్రజలమీద కోలుకోని ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని కొన్ని నిర్ణయాల మీద ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుందని కొందరు రాజకీయ ప్రముఖులు చెబుతున్నారు. ఇక ఏ సమస్య ఉన్న ప్రజల్లోకి తీసుకెళ్లే మీడియాకు కూడా ఇప్పుడొక సమస్య వచ్చింది.
అదేమంటే తెలంగాణ తాత్కాలిక సచివాలయంలోకి మీడియాను బ్యాన్ చేసారట.. దీంతో తమకు అనుమతి ఇవ్వాలని మీడియా ప్రతినిధులు సీఎస్ ఎస్కె జోషీకి వినతి పత్రం సమర్పించారు. అంతేకాదు మీడియాకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సచివాలయ తాత్కాలిక భవనం ముందు మౌనంగా నిరసన వ్యక్తం చేశారు. ఇక సమస్య ఎక్కడ వచ్చిందంటే ఇంతకుముందు తెలంగాణ సచివాలయ భవనాన్ని కూల్చివేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. దీంతో తాత్కాలిక సచివాలయంగా బూర్గుల రామకృష్ణారావు భవనాన్ని ఉపయోగిస్తున్నారు.
అయితే తాత్కాలిక సచివాలయ భవనంలోకి మీడియాను అనుమతించడం లేదు. సమాచార సేకరణ కోసం తాత్కాలిక సచివాలయ భవనంలోకి వెళ్లేందుకు పాస్ జారీ చేయాలని లేదా అనుమతి ఇవ్వాలని మీడియా ప్రతినిధులు కోరారు. ఈ విషయమై శుక్రవారం నాడు మీడియా ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషిని కలిసి వినతి పత్రం సమర్పించారు. తాత్కాలిక సచివాలయ భవనంలో సమాచార సేకరణ కోసం తమకు అనుమతి ఇవ్వాలని కోరారు.
ఇక గతంలో కూడ సచివాలయ భవనంలోకి మీడియా అనుమతి విషయమై ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ సమయంలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆ రకమైన ప్రతిపాదన జరగలేదనీ సీఎంఓ అధికారులు వివరణ ఇచ్చారు. ప్రస్తుతం తాత్కాలిక సచివాలయంలో స్థలం లేదనే కారణంగా జర్నలిస్టులకు అనుమతి నిరాకరిస్తున్నారనే ప్రచారం లేకపోలేదు. ఇకపోతే సమాచార సేకరణ విషయంలో తమకు ఆటంకం కల్గించవద్దని ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు కోరారు....