రాష్ట్రంలోని 15 పర్యాటక ప్రదేశాల్లో వరల్డ్ క్లాస్ హోటల్స్ వచ్చేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యువజన సర్వీసులు, పర్యాటకశాఖపై సీఎం జగన్ తాడేపల్లిలో నిర్వహించిన సమీక్షలో పలు అంశాలపై చర్చించారు. సీఎం నిర్వహించిన సమీక్షపై మంత్రి అవంతి శ్రీనివాస్ వివరాలు అందించారు. 

 

 

 

ఇడుపులపాయలలో శిల్పారామం ఏర్పాటు చేస్తామని, కోటి రుపాయలతో రాష్ట్రంలోని శిల్పారామాలకు మరమ్మతులు చేపడతామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌తో ఇంటిగ్రేడ్‌ చేస్తామని, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆర్కియాలజీ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నామని కూడా మంత్రి వివరించారు. బాషా, సంస్కృతి అభివృద్ధికి కృషి చేయాలని, సంస్కృతి వికాస కేంద్రాల ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించినట్టు తెలిపారు. నదిలో బోటు రవాణాపై త్వరలోనే కమిటీ వేసి నివేదిక అందిస్తామని తెలిపారు. అలాగే నదిలో కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బోట్ల ఫిట్‌నెస్‌ చూశాకే అనుమతి ఇక్కడి నుంచే ఇస్తామని పేర్కొన్నారు. జిల్లాకు ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని మండల, నియోజకవర్గస్థాయిల్లో స్టేడియంల అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. క్రీడాకారులకు ప్రోత్సహకాలు, కొండపల్లి పోర్ట్, గాంధీ మ్యూజియం పూర్తి చేయాలని కూడా సీఎం స్పష్టం చేశారని మంత్రి తెలిపారు. వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో విశాఖ, విజయవాడ, తిరుపతిలో స్టేడియంల ప్రతిపాదనకు సీఎం గ్రీన్‍సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తామని..  కళాకారులను గుర్తించి ప్రోత్సాహం అందించనున్నట్లు వెల్లడించారు. 

 

 

 

కాగా.. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంపై సీఎం ఈ సమావేశంలో స్పందించారు. బాధితులకు పరిహారం చెల్లింపులో జాప్యంపై సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించారు. బాధిత కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించాలని సీఎం జగన్ ఆదేశించారు. తెలంగాణలోని బాధిత కుటుంబాల నుంచి ధ్రువపత్రాలు రావట్లేదని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు తెలిపారు. పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించాలని సీఎం ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: