చైనా అధ్యక్షుడు జిన్పింగ్ శుక్రవారం మధ్యాహ్నం చెన్నై అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్పోర్టులో ఆయనకు తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, సీఎం పళనిస్వామిలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చూసిన పలు సాంస్కృతిక ప్రదర్శనలను ఆసక్తిగా తిలకిస్తూ జిన్పింగ్ ముందుకు సాగారు. ఇక జిన్పింగ్ రాక సందర్భంగా చైనా బలగాలు చెన్నై ఎయిర్పోర్టును తమ కంట్రోల్లోకి తీసుకున్నాయి. ఆయన కోసం ప్రత్యేకంగా చైనా నుంచి నాలుగు అత్యాధునిక వాహనాలు చెన్నైకు వచ్చాయి.
జిన్పింగ్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఐటీసీ చోళ హోటల్కు వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకున్నాక సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన మహాబలిపురం బయలుదేరుతారు. నేడు, రేపు రెండు రోజులపాటు చెన్నై సమీపంలోని మహాబలిపురం వేదికగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరపనున్నారు. ఇది మోదీ, జిన్పింగ్ల మధ్య జరుగుతున్న రెండో అనధికారిక సమావేశం. ఇక తాజా పర్యటనలో ఏం చర్చిస్తారా ? అన్నది ఆసక్తిగా మారింది.
ఇక ఈ పర్యటనకు గాను ఆయనకు అదిరిపోయే వంటలతో విందులు ఏర్పాటు చేస్తున్నారు. భారత్ విచ్చేసిన విశిష్ట అతిథి కోసం ప్రధాని మోదీ విందు ఏర్పాటు చేశారు. ఈ విందు కోసం ఏర్పాటు చేసిన మెనూ చూస్తే షాకింగ్గా ఉంది. జిన్ పింగ్ ను అచ్చెరువొందించేలా ప్రత్యేక వంటకాలతో మెనూ రూపొందించారు. ఈ మెనూలో ఎంతో పేరుగాంచిన తమిళ వంటకాలకు స్థానం కల్పించారు. కవణరాశి హల్వా, అరచవిట్ట సాంబారు, తక్కాల్ రసమ్ (టమోటా చారు), కడలాయ్ కుర్మా తదితర వంటకాలను జిన్ పింగ్ కు వడ్డించనున్నారు.
చెట్టినాడ్ వంటకాల నుంచి కారైక్కుడి ఆహార పదార్థాల వరకు జిన్ పింగ్ విందు భోజనంలో కొలువుదీరనున్నాయి. ఇక రాత్రి భోజనంలో భాగంగా టమాటా చారును ఆయనకు ఇష్టం అయిన నేపథ్యంలో దానిని కూడా మెనూలో పెట్టారు.