తెలంగాణ వ్యాప్తంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు రాజకీయ పార్టీలు తమ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీలతో పాటు ఉద్యోగ సంఘాల మద్దతు కూడా తీసుకోవాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు భావించాయి. గతంలో ఉద్యోగ సంఘాలు, ఆర్టీసీ సంఘాలు కలిసి పని చేసిన నేపథ్యంలో... తమ సమస్య పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగ సంఘాలు కూడా కలిసి రావాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. అయితే ఈ విషయంలో ఆర్టీసీ ఉద్యోగులకు ఊహించని విధంగా షాక్ తగిలిందనే ప్రచారం జరుగుతోంది. గురువారం మధ్యాహ్నం టీఎన్జీవో ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో టీఎన్జీవో ఉద్యోగులు సీఎం కేసీఆర్‌ను కలవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డీఏ పెంపు, పీఆర్సీ అంశంపై టీఎన్జీవో నేతలు సీఎం కేసీఆర్‌తో చర్చించారని సమాచారం. వారి వినతులకు సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్... ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీఎన్జీవో ఉద్యోగులు మద్దతు ఇవ్వకుండా చేసేందుకు సీఎం కేసీఆర్ ఈ రకమైన వ్యూహరచన చేశారనే టాక్ వినిపిస్తోంది.

తమ కోసం టీఎన్జీవో ఉద్యోగులు పెన్ డౌన్ చేస్తే... ప్రభుత్వం కచ్చితంగా దిగొస్తుందని ఆర్టీసీ కార్మికులు భావించారు. అలా చేస్తే తెలంగాణలో మరోసారి సకల జనుల సమ్మె నాటి పరిస్థితులు ఏర్పడతాయని వాళ్లు అంచనా వేసినట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన సీఎం కేసీఆర్... టీఎన్జీవోలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ఇవ్వకుండా ఉండేందుకు వారిని పిలిపించి మాట్లాడారని రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఒకప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు అండగా నిలిచిన టీఎన్జీవోలు... ఈ సారి మాత్రం వారికి దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: