ఆర్టీసీ ఉద్యోగులను ఏకపక్షంగా తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యం లో పలువురు కార్మికులు భయాందోళనలకు గురయి గుండెపోటు తో మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది . ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ తో గత ఏడు రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెల్సిందే . సమ్మె చేస్తోన్న కార్మికుల్ని విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం తో పలువురు కార్మికులు తమ ఉద్యోగం పోయిందని తీవ్ర మానసిక ఒత్తిడికి గురయి గుండె ఆగి చనిపోయారు .

హెచ్ సి యూ డిపో కు చెందిన సీనియర్ డ్రైవర్ ఎస్ కె ఖలీల్ మియా, ప్రభుత్వ ప్రకటన అనంతరం తన ఉద్యోగం పోయిందన్న ఆందోళనతో గుండెపోటు కు గురయి , ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందాడు . చెంగిచర్ల డిపో కు చెందిన మరొక డ్రైవర్ కొమురయ్య కూడా తన ఉద్యోగ భద్రత పై  ఆందోళన చెందుతూ , తీవ్ర మనస్థాపానికి గురయి గుండెపోటు మృతి చెందగా , హాకింపేట డిపో లో కండక్టర్ గా విధులు నిర్వహిస్తోన్న పద్మ భర్త కూడా , భార్య ఉద్యోగం పోయిందని , ఇక చేసిన రుణాలు ఎలా చెల్లించాలో తెలియక తీవ్ర మానసిక ఒత్తిడి తో గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు .

సమ్మె కు వెళితే  రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుందని భావిస్తే, విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడాన్ని ఆర్టీసీ కార్మికులు జీర్ణించుకోలేపోతున్నారు . తమకు వచ్చేది అంతంత  మాత్రం జీతాలేనని , ఇప్పుడు విధుల్లో నుంచి తొలగించమని ప్రభుత్వం ప్రకటించడం తో అవి కూడా రాకపోతే తమ పరిస్థితి ఏమిటని ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . 



మరింత సమాచారం తెలుసుకోండి: