సౌమ్యుడైన రాజకీయవేత్తగా పేరున్న మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఊహించని రీతిలో వార్తల్లో నిలువున్నారా? వివాదరహితుడైన ఆయన వివాదం రగులుతున్న సమయంలో....చిక్కుల్లో పడనున్నారా? ప్రస్తుతం ఈ చర్చ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సాగుతోంది. కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవంలో పాల్గొనాలంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ అధికారికంగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. దీనిపై మన్మహన్ సింగ్ స్పందనే ఈ చర్చకు కారణంగా మారింది.
పాకిస్థాన్లోని కర్తార్పూర్లో ఉన్న 16వ శతాబ్దం నాటి దర్బార్ సాహిబ్ గురుద్వారాను భారతీయ సిక్కుయాత్రికులు దర్శించుకునేందుకు వీలుగా ఇరుదేశాల మధ్య నిర్మించనున్న కారిడార్కు మనదేశం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలో ఉన్న డేరాబాబా నానక్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు వరకు కారిడార్ నిర్మాణాన్ని భారత్ చేపట్టనుండగా, తన భూభాగంలో ఆ ప్రాజెక్టును పాక్ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో...కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి రాష్ర్టపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు ఆయన నేతృత్వంలో అన్ని పార్టీల సభ్యులతో కూడిన బృందాన్ని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కూడా ఆహ్వానించారు.
తమ ఆహ్వానాన్ని మన్మోహన్ కూడా అంగీకరించారని పాక్ ప్రధాని తరఫున విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే, ఇంతలోనే కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. పాక్ ఆహ్వానంపై తమకు ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం అందలేదని మన్మోహన్ కార్యాలయం పేర్కొంది. కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి మన్మోహన్ హాజరుకాకపోవచ్చని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే, అధికారిక ప్రకటన విడుదల కాకపోవడం గమనార్హం.రెండు దేశాల ప్రజల మధ్య ఉమ్మడి ఆధ్యాత్మిక వారసత్వానికి, ప్రేమకు కర్దార్పూర్ కారిడార్ వారధిగా నిలువనుందని పలువురు భావిస్తున్నారు.