ఏ నాయకుడి పాలన చూసినా ఏమున్నది గర్వకారణం.. అన్నట్టుంటుంది పేదల పరిస్థితి చూస్తే.. ప్రజలను పేదరికం నుంచి బయటపడేయకుండా ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఫలితం ఉండదు. ఇక పేదరికం విషయానికి వస్తే.. గ్రామీణ పేదరికం కంటే పట్టణ పేదరికం మరీ దారుణం. అందుకే పట్టణాల్లోని పేదలకు సొంత గూడు సదుపాయ కల్పించాలని జగన్ సర్కారు నిర్ణయించింది.


పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు.. పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంకల్పించారు. ఏపీ టౌన్‌షిప్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏపీటిడ్కో రాష్ట్రంలోని 110 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మొదటి దశగా పది లక్షల ఇళ్లు కట్టించాలని నిర్ణయించాయి. పట్టణాల్లో జి+3 విధానంలో 10 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాయి.


ఒక ఎకరా విస్తీర్ణంలో జి+3 విధానం కింద 100 యూనిట్లను అన్ని వసతులతో నిర్మించాలన్నది ప్రణాళిక. ఒక్కో యూనిట్‌ను 330 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఆ గృహ సముదాయాల వద్ద కమ్యూనిటీ హాలు, పార్కు, ఇతర మౌలిక వసతులు సమకూరుస్తారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల గృహాల కోసం 10వేల ఎకరాలు అవసరమని ఉన్నతాధికారులు అంచనా వేశారు.


వచ్చే ఉగాది నాటికి లబ్ధిదారులకు స్థలాలు రిజిస్ట్రేషన్‌ చేయించి అనంతరం ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఏపీటిడ్కో నిర్ణయించింది. ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమంలో ఇళ్ల కోసమే పేదల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఈ అంచనాకు వచ్చింది. విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే దాదాపు 2 లక్షల ఇళ్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. విజయవాడలో లక్ష ఇళ్లు, గుంటూరులో 70 వేలు, తిరుపతిలో 60వేల ఇళ్ల కోసం దరఖాస్తులు వచ్చాయి.


ఇలా రాష్ట్రం మొత్తం మీద పట్టణ ప్రాంతాల్లో 10 లక్షల ఇళ్లు నిర్మించాల్సి ఉంటుందని టిడ్కో గుర్తించింది. ఈ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన భూములను గుర్తించే ప్రక్రియను రెవెన్యూ శాఖ ఇప్పటికే చేపట్టింది. అవసరమైతే ప్రైవేటు భూములను కొనుగోలు చేయాలని కూడా సీఎం వైఎస్‌ అధికారులను ఆదేశించారు. ఉగాది నాటికి లబ్ధిదారుల పేరిట ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేస్తారు. పట్టణ ప్రాంతాల్లో ఒక ఎకరా భూమిని ఉమ్మడిగా 100 మంది లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని నిర్ణయించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: