ముఖ్యమంత్రి వైఎస్
జగన్ రాజకీయ దూకుడు నెమ్మదిగా పెంచుతున్నారా. అంటే సమాధానం అవుననే వస్తోంది. గత నాలుగున్నర నెలలుగా పాలనలో మునిగితేలుతున్న
జగన్ రాజకీయాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. తన సొంత పార్టీ గురించి కూడా ఆయన ఆలోచనలు చేయడంలేదు. ప్రభుత్వాన్ని గాడిన పడేయాలన్న ఏకైక ఆలోచనతోనే పనిచేస్తూ వచ్చారు. ఇపుడు పాలన మెల్లగా దారిలో పడుతోంది. దాంతో
జగన్ కూడా ఏపీలో రాజకీయం ఏంటి అన్నది ఓ చూపు చూస్తున్నారంటున్నారు.
రాష్ట్రంలో టీడీపీకి పోటీగా తామూ రేసులో ఉన్నామంటూ చెప్పుకుంటున్న బీజేపీ మీద టార్గెట్ చేయాలని
జగన్ తాజాగా అనుకుంటున్నారని అంటున్నారు. జగన్ ద్రుష్టిలో బీజేపీ ఇప్పట్లో ప్రమాదం కాకపోయినా భవిష్యత్తు రాజకీయం ద్రుష్ట్యా ఇప్పటినుంచే నరుక్కు రావాలని భావిస్తునారుట. దానికి తోడు బీజేపీ విషయంలో ఎంతలా సానుకూలంగా ఉంటూ వస్తున్నా కూడా ఏపీ బీజేపీ నాయకులు రెచ్చిపోవడం, ప్రతీ రోజూ ప్రభుత్వం మీద దారుణంగా విమర్శలు చేయడం జగన్ని ఇరిటేట్ చేస్తున్నాయట.
ఓ దశలో టీడీపీ కంటే కూడా బీజేపీ ఎక్కువగా జగన్ని టార్గెట్ చేస్తోంది. ప్రభుత్వం మీద లేని పోని విమర్శలు చేస్తూ అల్లరిపెడుతోంది. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ పని అయిపోయిందని
జగన్ అంచనా వేస్తున్నారు. చంద్రబాబు ఎన్ని ఆరోపణలు చేసినా వాటిని జనం రెస్పాండ్ అవరని, ఆ విధంగా విశ్వసనీయత లేకుండా ఆయన చేసుకున్నారని అంటున్నారు.
అయితే బీజేపీ కేంద్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏపీలో రెచ్చిపోతోందని
జగన్ భావిస్తున్నారుట. చీటికీ మాటికి వైసీపీ సర్కార్ని విమర్శించడమే పనిగా పెట్టుకుందని ఆయన అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. కేంద్రం ఏపీ మీద ప్రత్యేకంగా
ప్రేమ చూపించకపోగా ఏపీలో బీజేపీ మాత్రం వూరికే విమర్శలు చేయడం చూస్తూ ఎంతకాలం భరించాలన్న ఆవేదన వైసీపీ నేతల్లో ఉంది.
మరో వైపు బీజేపీలో ఉన్న నాయకులను ఇకపై టార్గెట్ చేయడం, వీలుంటే వారిని వైసీపీలోకి చేర్చుకోవడం ద్వారా ఆ పార్టీకి గట్టి ఝలక్ ఇవ్వాలని కూడా
జగన్ ఆలోచన చేస్తున్నారుట. ఇందులో భాగంగానే ఒకనాటి బీజేపీ నేత , మాజీ ఎమెల్య్యే ఆకుల సత్యనారాయణను వైసీపీలో చేర్చుకున్నారని, రానున్న రోజుల్లో దగ్గుబాటి పురంధేశ్వరిని, ఇతర నాయకులను చేర్చుకుని బీజేపీకి సరైన షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని
జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు. మరి చూడాలి. జగన్ దూకుడు మోడీని ఢీ కొట్టెవరకూ వెళ్తుందో లేదో.