తెలంగాణాలో రాజుకుంటున్న సమ్మె సెగలు ఇప్పుడు తమ ఉద్యోగాలను కోల్పోయ్యే స్థాయికి వచ్చింది. ఆర్టీసీలో సమ్మె చేస్తున్న కార్మికుల సెల్ఫ్‌ డిస్మిస్‌తో ఖాళీ అయిన పోస్టుల భర్తీకి యాజమాన్యం చర్యలు వేగవంతం చేస్తోంది. పదిహేను రోజుల్లోగా ఆర్టీసీని పూర్వ స్థితికి తీసుకురావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ మేరకు ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. 7 రోజులుగా సమ్మె కొనసాగుతుండగా.. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు చేరని వారంతా సెల్ఫ్‌ డిస్మిస్‌ అయినట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఈ గణాంకాలను ప్రాతిపదికన తీసుకున్న ఆర్టీసీ అధికారులు ఎన్ని పోస్టులు కొత్తగా భర్తీ చేయాలనే దానిపై కసరత్తు దాదాపు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 97 బస్‌ డిపోల పరిధిలో డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామికులు, సూపర్‌వైజర్లు తదితర కేటగిరీల లెక్కలు తేల్చిన ఆర్టీసీ యాజమాన్యం ప్రాథమిక నివేదిక రూపొందించింది. ఆర్టీసీలో మూడు పద్ధతుల్లో బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సిబ్బంది అవసరం ఏ మేరకు ఉంటుందనే దానిపై అంచనాలు తయారు చేసిన అధికారులు ఏ విధంగా నియామకాలు చేపట్టాలనే దానిపై ప్రతిపాదనలు సైతం సిద్ధం చేసినట్లు సమాచారం. కొత్తవిధానం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామికులు ఇతర సిబ్బంది కలుపుకొంటే దాదాపు 25 వేల మంది వరకు అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించిన ఆర్టీసీ సీఎం కేసీఆర్‌కు సమర్పించేందుకు సిద్ధమైంది. వాస్తవానికి శుక్రవారం సాయంత్రం కల్లా సీఎంవోలో సమర్పించాల్సి ఉన్నా  అనివార్య కారణాల వల్ల జాప్యం జరిగినట్లు తెలిసింది.

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారికి టిమ్స్‌ ద్వారా టికెట్లు జారీ చేసే ప్రక్రియపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ స్పష్టం చేశారు.తిరిగి ఆర్టీసీ మళ్ళీ గాడిలో పడనుందేమో అని అంతా వేచి చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: