హుజూర్ నగర్ ఉప
ఎన్నిక సమయంలో కెసియార్ కు పెద్ద షాకే తగిలింది. ఉపఎన్నికలో గెలవటం కెసియార్ కు
అత్యంత ప్రతిష్టగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఈ దశలో టిఆర్ఎస్ కు సిపిఐ తన
మద్దతు ఉపసంహరించుకుంది. కాంగ్రెస్ సిట్టింగ్ సీటైన నల్గొండ జిల్లాలోని హుజూర్
నగర్ అసెంబ్లీ సీటులో హస్తం పార్టీకి మంచి పట్టుంది. కాబట్టి సహజంగానే ఉపఎన్నికలో
గెలవటానికి కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు.
సరే పోటిలో టిడిపి, బిజెపి కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే సిపిఎం అభ్యర్ధి నామినేషన్ రెజెక్టవ్వగా సిపిఐ మాత్రం టిఆర్ఎస్ కు మద్దతుగా నిలిచింది. నిజానికి సిపిఐ టిఆర్ఎస్ కు మద్దతుగా నిలవటమే విచిత్రం. ఎందుకంటే వామపక్షాలను కెసియార్ ఎంత హీనంగా చూస్తున్నారో అందరికీ తెలిసిందే. వామపక్షాల నేతలు అపాయిట్మెంట్ కోరితే కెసియార్ కనీసం ఇవ్వను కూడా లేదు.
పైగా చాలా సందర్భాల్లో వామపక్షాలను కెసియార్ తోక పార్టీలంటూ ఎన్నోసార్లు హేళనగా మాట్లాడారు. అయినా టిఆర్ఎస్ కు సిపిఐ మద్దతు ఇవ్వాలని అనుకున్నదంటే సిపిఐ ఎంతటి ధీనస్ధితిలో ఉందో అర్ధమైపోతోంది.
అయితే ఇక్కడే ట్విస్టు మొదలైంది. అదేమిటంటే హుజూర్ నగర్ ఉపఎన్నిక ప్రచారం ఊపందుకునే సమయంలోనే ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సమ్మె మొదలైంది. ఆర్టీసి సమ్మె అంటే వామపక్షాల మద్దతు బలంగా ఉంటుందని అందరికి తెలిసిందే. ఒకవైపు ఆర్టీసీ సమ్మె ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతుంటే అదే సిపిఐ కెసియార్ కు ఉపఎన్నికలో మద్దతిస్తుందనే ప్రశ్న తలెత్తింది.
ఇదే విషయమై అత్యవసరంగా సమావేశమైన పార్టీ నేతలు సుదీర్ఘంగా చర్చించారు. క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను భేరీజు వేసుకుని హుజూర్ నగర్ ఉపఎన్నికలో మద్దతు ఉపసంహరించుకోవాలని డిసైడ్ చేసింది. అదే విధంగా ప్రకటన కూడా చేసేసింది. హుజూర్ నగర్ లో సిపిఐ కూడా అంతో ఇంతో బలముంది. అలాంటిది ఇపుడు మద్దతు ఉపసంహరణతో కెసియార్ ఎలా రియాక్టవుతారో చూడాలి. సరే జరిగిన డెవలప్మెంట్ తో కాంగ్రెస్ అయితే ఫుల్లు జోష్ గా ఉంది.