తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఉద్యమం మరో స్థాయికి చేరింది. మొన్నటి వరకు శాంతంగా సమ్మె చేస్తూ వచ్చిన కార్మికులు ఇప్పుడు దాన్ని ఉదృతం చేశారు. ఆర్టీసీ సమ్మె సమయంలో సంయమనం పాటిస్తూ వస్తున్న కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావడం లేదు. పైగా నిన్నటి రోజున కెసిఆర్ సమీక్ష నిర్వహించి.. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వంలో ఆర్టీసీని చేర్చే ఉద్దేశ్యం లేదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది.
దీంతో పాటు సమ్మె చేస్తున్న కార్మికులను ఉద్యోగులుగా గుర్తించడం లేదని స్పష్టం చేసింది. దీంతో నిన్నటి రోజున ఆర్టీసీ భవన్ ముందు ధర్నాకు దిగారు. ధర్నాకు దిగిన ఆర్టీసీ కార్మికులతో పాటు, వివిధ పార్టీలు కూడా సపోర్ట్ చేశాయి. రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, తాత్కాలిక ఉద్యోగులను ఏర్పాటు చేయాలనీ, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని హెచ్చరించింది ప్రభుత్వం. అంతేకాదు, ప్రభుత్వం ముందు మరిన్ని సమస్యలు వచ్చి చేరుతున్నాయి.
ఖమ్మంలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల్లో ఒకరైన
శ్రీనివాస్ రెడ్డి అనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీరియస్ కావడంతో ఆయన్ను హైదరాబాద్ కు తరలించారు. అప్పటికే అయన మరణించాడు. దీంతో ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత మొదలైంది. ఆర్టీసీ కార్మికులు రోడ్డుపైకి వచ్చి భైఠాయించారు.
శ్రీనివాస్ రెడ్డి త్యాగం ఊరికే పోదని, ఒక్క
శ్రీనివాస్ రెడ్డి మాత్రమే కాదు.. ప్రభుత్వం దీనిపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోకపోతే మరికొంతమంది కూడా ఇలానే ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
శ్రీనివాస్ రెడ్డి మరణంతో ఖమ్మం జిల్లాలో బంద్ పాటించేందుకు ఆర్టీటీ కార్మికులు సిద్ధం అయ్యారు. ఒక్క ఖమ్మంలోని కాదు.. మిగతా జిల్లాల్లో కూడా కార్మికులు నిరసనలు చేస్తున్నారు. డిపోల ముందు మౌనవ్రతం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై భైటాయిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల నిరసనలు క్రమక్రమంగా పెరిగి కెసిఆర్ మెడకు చుట్టుకునేలా ఉన్నది.
శ్రీనివాస్ రెడ్డి మరణంపై కెసిఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.