హుజుర్ నగర్ ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌ నాయకులు మద్యం, డబ్బు సంచులతో గ్రామాల్లోకి వస్తున్నారని కాంగ్రెస్‌ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం హుజుర్ నగర్ మండలం మట్టపల్లి క్షేత్రంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి మట్టపల్లి, రాంచంద్రాపురం తండా, బీమ్లాతండా, బోజ్యాతండా, క్రిష్ణాతండా, గుర్రంబోడు తండా, పెదవీడు, చింతలమ్మగూడెం, సుల్తాన్‌పూర్‌తండా, మఠంపల్లిల్లో, ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు.


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ ఆయన మాట్లాడుతూ ఈప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్‌ హయాంలో తాను ఎంతో కృషిచేశానని చెప్పుకొచ్చారు. తాను చేసిన అభివృద్ధిని ప్రజల నుంచి విడదీయలేక అధికార పార్టీ నేతలు డబ్బు, మద్యం సంచులతో వస్తున్నారని దానిలో భాగంగా లక్షల విలువచేసే మద్యం నిల్వలతో పట్టుబడుతున్నారని అయన ఈ సందర్బంగా తెలిపారు.


కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే ఉత్తమ్‌ కుటుంబానికే లాభమని కొంతమంది విష ప్రచారం చేయడం ఆలోచించవలిసిన అవసరం ఉంది అని అన్నారు. మాకు పిల్లలులేని విషయం లోకమంతా తెలుసని అవసరంలేని సంపాదనను పక్కన పెట్టి ఈ ప్రాంతంలో రూ.వేల కోట్లతో చేపట్టిన పనులతో ప్రజాభిమానం చూరగొన్నామని అయన తెలిపారు.


టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి ఇటీవల ఒక రైల్వే కాంట్రాక్టర్‌ను బెదిరిస్తే సదరు కాంట్రాక్టర్‌ తనకు ఫిర్యాదు చేశాడని అని అన్నారు. ఈ ఉపఎన్నికల్లో ఓటమి అనంతరం తెరాస అభ్యర్థి కెనడాకు తిరుగు ప్రయాణం తప్పదని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలోని మఠంపల్లి, మేళ్లచెరువు, పాలకీడు మండలాలను కలుపుతూ హైదరాబాద్, విజయవాడ మధ్య ప్యాసింజర్‌ రైలు నడిపించేందుకు కృషి చేస్తా అని అయన తెలిపారు. హుజూర్‌నగర్‌ లో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వ అమృత్‌ పథకంలో భాగంగా హుజూర్‌నగర్‌ ను స్మార్ట్‌ పట్టణంగా గుర్తించేందుకు కృషి చేస్తా అన్నారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెల్ల శారద, టీపీసీసీ కార్యదర్శలు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మాధవి, అనిత, సాముల శివారెడ్డి, మంజీనాయక్, రాజారెడ్డి, కిషోర్‌రెడ్డి, నవీన్‌నాయక్, అప్పారావు, శ్రీనివాస్, భీముడు తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: