విందు
రాజకీయానికి రంగం రెడీ అయ్యిందా ? రాజకీయ వర్గాల్లో ఇపుడీ అంశంపైనే చర్చలు
జోరందుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుద్దామని మెగాస్టార్
చిరంజీవి అపాయిట్మెంట్ అడిగారు. అయితే అడిగిన తేదీన భేటి ఫిక్సయి మళ్ళీ
రద్దయ్యింది. అయితే తాజాగా అపాయిట్మెంట్ ఫిక్సయిన విషయం చిరంజీవికి సిఎం కార్యాలయం
కబురు పంపించింది.
ఇక్కడే అందరిలోను ఆసక్తి పెరిగిపోయింది. ఎందుకంటే ఎందుకంటే రెండోసారి అపాయిట్మెంట్ ఇచ్చిన జగన్ మెగాస్టార్ ను విందుకు రమ్మని కోరటమే అందరినీ ఆశ్చర్యపరిచింది. అందులోను మెగాస్టార్ ను సతీ సమేతంగా రమ్మని జగన్ వర్తమానం పంపారు. దాంతో చిరు దంపతులు హైదరాబాద్ నుండి విజయవాడకు ప్రత్యేక విమానంలో దిగారు. అమరావతిలోని జగన్ నివాసానికి కూడా చేరుకున్నారు లేండి.
అసలు చిరంజీవి సిఎంను ఎందుకు కలవాలని అనుకున్నారు ? రాజకీయంగా అయితే చిరంజీవి దాదాపు తెరమరుగైపోయినట్లే లెక్క. పోని ఈమధ్యనే విడుదలైన సైరా నరసింహారెడ్డి సినిమా సినిమా అదనపు షోల ప్రదర్శనకు అనుమతిచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పటానికే అనుకుందాం. అనుమతి ఇచ్చి కూడా చాలా రోజులైపోయింది. కాబట్టి ఆ విషయానికే ప్రత్యేకంగా కలుద్దామని అనుకున్నారంటే డౌటే.
ఇక మిగిలింది సైరా నరసింహారెడ్డి సినిమాను చూడమని జగన్ ను రిక్వెస్ట్ చేయటానికి అనుకుందాం. ఈ కారణం ఒక్కటే కాస్త సబబుగా ఉందనే అనుకోవాలి. గతంలో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బయోపిక్ ’యాత్ర’ ను చూడమని ఆ డైరెక్టర్ జగన్ ను కోరారు. కావాలంటే జగన్ కోసం ప్రత్యేక షో వేస్తామని కూడా రిక్వెస్ట్ చేశారు. అయితే డైరెక్టర్ కోరికను జగన్ సున్నితంగా తిరస్కరించారు.
మరిపుడు చిరంజీవి కూడా సైరా సినిమాను చూడమని కోరితే జగన్ ఏమంటారో చూడాల్సిందే. ఎందుకంటే సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చిన విషయం అందరకీ తెలిసిందే. ఒకవైపేమో తమ్ముడు పవన్ కల్యాణ్ ప్రతీ విషయంలోను రాజకీయంగా జగన్ ను వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో అన్న, మెగాస్టార్ ఏమో జగన్ ను ప్రత్యేకంగా కలుస్తున్నారు. మరి విందు రాజకీయంలో ఏమి జరుగుతుందో చూడాల్సిందే అనే ఉత్సుకత అందరిలోను పెరిగిపోతోంది.