దశాబ్దాల తరబడి న్యాయస్థానాల్లో నానుతూ వస్తోన్న అత్యంత సున్నితమైన, హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదానికి ఇక దాదాపు తుది అంకానికి చేరుకున్న నేపథ్యంలో అయోధ్యలో క్రమంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటిదాకా 37 సార్లు సుప్రీంకోర్టు ఈ కేసుపై వాదోపవాదాలను ఆలకించింది. అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం.. మరో మూడు రోజుల్లో తన తుది తీర్పును వెలువరించనుంది.
ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్లోని అయోధ్య జిల్లాలో సెక్షన్ 144 విధిస్తున్నట్లు అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ అనూజ్
కుమార్ ఝా చెప్పారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలం విషయంలో సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా పౌరుల భద్రత కోసం 144 సెక్షన్ ను అమలు చేస్తున్నామని కలెక్టరు పేర్కొన్నారు. అయోధ్యలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించారు. అయోధ్యలో తీర్పు అనంతరం బాణసంచా కాల్చకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీపావళి పండగ సందర్భంగా కూడా బాణసంచాను విక్రయించకుండా చర్యలు తీసుకున్నారు.
144 సెక్షన్ అమల్లో ఉన్న సమయంలో ఎలాంటి ఉత్సవాలు గానీ, పండుగలు గానీ నిర్వహించినప్పటికీ.. ప్రజలు గుమికూడ రాదని వెల్లడించారు. అయోధ్యలో నలుగురి కంటే ఎక్కువమంది గుమిగుడితే అల్లర్లు జరుగుతాయని ముందుజాగ్రత్తగా 144 సెక్షన్ నిషేధ ఉత్తర్వులు అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టరు ప్రకటించారు. ఇది డిసెంబర్ 10 వరకు అమల్లో ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
అయోధ్య కేసును సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆగస్ట్ 6వ తేదీ నుంచి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.రంజన్ గొగొయ్ సహా న్యాయమూర్తులు ఎస్ ఏ బొబ్డే, డీవై చంద్రచూడ్,
అశోక్ భూషణ్, ఎస్ ఏ నజీర్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ విచారణలో వాదనలు 17వ తేదీతో ముగియనున్నా యి.