2019 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్..అప్పుడే టార్గెట్ 2024 లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. వైసీపీఎల్పీ నేతగా ఎన్నికైన సమయంలోనే జగన్ తన లక్ష్యాన్ని స్పష్టం చేసారు. ఇక పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో గెలిచిన మనం సమర్ధతవంతమైన పాలన అందిస్తూ 2024 ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని నిర్దేశించారు. తన పాలన లక్ష్యం ఇదేనని స్పష్టం చేసారు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు..
ఇకపోతే పంచాయతీరాజ్, గృహనిర్మాణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం విజయవాడలోని సెర్ఫ్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి డీఆర్డీఏ పీడీల సమీక్షా సమావేశంలో పాల్గొన్న. సందర్భంగా మాట్లాడుతూ.. డీఆర్డీఏ పీడీలు ప్రతినెలా 15 రోజులపాటు ఫీల్డ్లో పని చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలతో పాటు, ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతే కాకుండా గ్రామీణాభివృద్ది కోసం కేటాయించిన పథకాల అమలును స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు.
వచ్చే జనవరి నుంచి అదనంగా 7 లక్షల మందికి వైఎస్సార్ పెన్షన్లు ఇస్తామని వెల్లడించారు. పెన్షన్ల ఎంపికలో గ్రామ సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, పొదుపు సంఘాలు చెల్లించాల్సిన రుణాలను నాలుగు విడతలుగా వారి చేతికే అందిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీనిని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. అదీకాకుండా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త పెన్షన్లకు, అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. గ్రామస్థాయిలో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా నవరత్నాలు సక్రమంగా అందేలా పీడీలు, సెర్ఫ్ సిబ్బంది చిత్తశుద్దితో పనిచేయాలని రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా ఆదేశించారు...