ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యం లో విద్యా సంస్థలకు దసరా సెలవుల పొడగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఓ సామాన్యుడు ముఖ్యమంత్రి కార్యాలయం హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి నిలదీశాడన్నదంతా ఉత్తి అబద్ధమని సిఎంఓ వర్గాలు తెలిపాయి . సిఎంఓ సిబ్బంది , సదరు వ్యక్తి మధ్య జరిగినట్లుగా చెబుతోన్న సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ మారింది . గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియా లో వైరల్ అవుతోన్న ఈ సంభాషణ ఆడియో పై సిఎంఓ వర్గాలు స్పందిస్తూ … సిఎంఓ కార్యాలయ సిబ్బంది మాట్లాడినట్లుగా ఫేక్ వాయిస్ తో ఆడియో సృష్టించారని చెప్పారు .
సోషల్ మీడియా లో జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని ఆపాలని , బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు . ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యం లో విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19 వరకు సెలవులు పొడగించిన విషయం తెల్సిందే. ఇప్పటికే 16 రోజులపాటు దసరా సెలవులు ప్రకటించగా , సెలవుల్ని పొడిగించడం పట్ల అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది . విద్యార్థులు తల్లితండ్రుల తో పాటు , ప్రయివేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఇలా ఒక్కరేమిటి పలువురు ప్రభుత్వాన్ని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు .
ఈ నేపధ్యం లో సిఎంఓ హెల్ప్ లైన్ కు ఒక సామాన్యుడు ఫోన్ చేసి ఇదే అంశం పై కార్యాలయ సిబ్బందిని నిలదీసినట్లుగా సోషల్ మీడియా లో అప్ లోడ్ చేసిన ఆడియో వైరల్ గా మారింది . కరీం నగర్ కు చెందిన ఒక యువకుడు సిఎంఓ సిబ్బంది ని నిలదీసిన ఆడియో కు కొనసాగింపుగా, తాజాగా ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాద్యాయుడు కూడా సెలవుల పొడగింపు ను తప్పుపడుతున్నట్లు ఉన్న మరొక ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది .