టెర్రరిస్ట్లను ఏరివేయడం ఒక్కటే సరిపోదా? దేశంలో మారణహోమాలకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదమే కారణమంటే చాలదా? ఈ విషయంలో దాయాది పాత్రను నిరూపించే బలమైన సాక్ష్యాలు కావాలంటున్నారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.
దేశంలోని యాంటీ టెర్రర్ స్క్వాడ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ చీఫ్లతో జాతీయ దర్యాప్తు సంస్థ- ఎన్.ఐ.ఎ ఢిల్లీలో కీలక సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మన దేశంలో పాక్ ప్రోత్సహంతోనే ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని, వీటికి దాయదే ఆర్థిక సాయం చేస్తోందని ఆయన చెప్పారు. అయితే వీటికి సంబంధించిన బలమైన ఆధారాలు కూడా సంపాదించాలని దర్యాప్తు సంస్థలకు సూచించారు. బలమైన సాక్ష్యాలుంటే అంతర్జాతీయ వేదికలపై పాక్ను ఏకాకిని అజిత్ ధోవల్ చెప్పారు.
మత ప్రభోదకుడు జకీర్ నాయక్, శ్రీలంకలో ఈస్టర్ రోజున బాంబు పేలుళ్లకు కారణమైన జహ్రాన్ హసిం వీడియోల ద్వారా చాలా మంది టెర్రరిస్ట్లుగా మారుతున్న విషయాన్ని తమ దర్యాప్తులో గుర్తించినట్లు ఎన్.ఐ.ఎ ఏజీ చెప్పారు. గత 30 సంవత్సరాలుగా దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణకు ఆయా సంస్థలు తీసుకుంటున్న చొరవను, ఇటీవల కాలంలో టెర్రరిస్ట్లు ఏ విధంగా దాడులకు పాల్పడుతున్నది ఈ సదస్సులో చర్చించారు.
ఉగ్రవాదం నానాటికీ పెచ్చుమీరుతోంది. ఎంతో మంది అమాయకులను పొట్టన పెట్టుకుంటోంది. వివిధ దేశాలపై దాడులకు దిగుతూ తమ ప్రాబల్యాన్ని చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఐక్యరాజ్య సమితి శాంతి మంత్రం జపిస్తుంటే.. అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. మరోవైపు
పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచిపోషిస్తోందనే వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. బాలకోట్ దాడుల తర్వాత కూడా ఉగ్రవాదుల వైఖరిలో మార్పు రావడంలేదు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదానికి గట్టిగా బుద్ది చెబుతున్నా కుక్కతోక వంకరలా ప్రవర్తిస్తోంది. మన సైనికులు దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ.. ఉగ్ర మూకల్ని మట్టుపెడుతూనే ఉన్నారు.