అర్థశాస్త్రంలో భారత సంతతికి చెందిన ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీని నోబెల్ బహుమతి వరించింది. ఆయన భార్య ఎస్తర్ డప్లో, మైఖేల్ క్రెమెర్లతో కలిసి ఈ అవార్డును అందుకోనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన కోసం చేసిన పరిశోధనలకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది రాయల్ స్వీడిష్ కమిటీ.
ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న పేదరిక నిర్మూలన కోసం కృషి చేసిన
అభిషేక్ బెనర్జీకి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ప్రపంచ వ్యాప్తంగా పేదరికాన్ని ఎలా నిర్మూలించాలో
బెనర్జీ పరిశోధనలు చేశారు. దీంతో ఆయనకు అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్కు ఎంపిక చేసింది కమిటీ. అభిజిత్ బెనర్జీతో పాటు ఆయన భార్య ఎస్తర్ డఫ్లో, మైఖేల్ క్రెమెర్ల పేర్లను ప్రకటించింది కమిటీ.
58ఏళ్ల అభిజిత్
బెనర్జీ కోల్కతాలో జన్మించారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లి హార్వర్డ్ యూనివర్శిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫోర్డ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ప్రొఫెసర్గా వ్యవహరిస్తున్నారు. తన సహ పరిశోధకురాలు ఎస్తర్ డఫ్లోను 2015లో వివాహం చేసుకున్నారు. ఎస్తర్ కూడా ఎంఐటీలో పేదరిక నిర్మూలన, ఆర్థిక రంగ అభివృద్ధిపై ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఎస్తర్తో కలిసి 2003లో అబ్దుల్ లతిఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్ను స్థాపించారు.
అమెరికాలో స్థిరపడినప్పటికీ భారత్ను మరిచిపోలేదు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సలహాలు, సూచనలు చేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు ఇండియాలో పర్యటిస్తూ... పేదలను కలిసేవారు వారి సమస్యలను దగ్గరనుంచి చూశారు అభిజిత్. అర్థశాస్త్రంలో నోబెల్ ప్రకటనతో ఈ ఏడాది నోబెల్ పురస్కారాలు ముగిశాయి. ఈ ఏడాది మొత్తం ఆరు రంగాల్లో 15 మందికి నోబెల్ పురస్కారాలు ప్రకటించగా.. ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఎస్తర్ డఫ్లోకు నోబెల్ రాగా.. సాహిత్యంలో పోలండ్కు చెందిన ప్రముఖ రచయిత్రి ఓల్గా టోకార్జుక్కు నోబెల్ వరించింది.