ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రైతు పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారు. రైతు సంక్షేమమే అజెండాగా ముందుకు వెళ్తున్నానంటున్న ఆయన.. మరో ఎన్నికల హామీని పట్టాలెక్కిస్తున్నారు. హామీ ఇచ్చిన దాని కంటే ఓ వెయ్యి రూపాయలు ఎక్కువే రైతుకు ఇస్తున్నారు. వైయస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం కింద ఇస్తానని ప్రకటించిన రూ.12,500లకు మరో రూ.వెయ్యి జోడించి రూ.13,500 అందించాలని జగన్ నిర్ణయించారు.
నేడు నెల్లూరు జిల్లాలో జగన్ ఈ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నారు. రైతు సంఘాల ప్రతినిధుల సూచన మేరకు పెట్టుబడి సాయాన్ని మూడు విడతలుగా అందించేలా జగన్ నిర్ణయం తీసుకున్నారు. వైయస్ఆర్ రైతు భరోసా పథకానికి వైయస్ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్ అని నామకరణం చేశారు. రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి, సీఎం వైయస్ జగన్కు ఉన్న కమిట్మెంట్ ఏంటో ఈ నిర్ణయంతో తెలిసిపోతోంది.
2017లో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు, పాదయాత్రలో రైతాంగం బాధలు వెల్లబోసుకున్నప్పుడు ప్రతి సంవత్సరం పెట్టుబడిసాయం అందిస్తానని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి నాలుగేళ్ల పాటు రూ. 12,500 ఇస్తానని చెప్పిన హామీని రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముందుగానే తీసుకొచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా.. రైతులను ఆదుకోవడం మన కర్తవ్యం అని భావించి ఈ ఏడాది నుంచి అమలు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
ఏ ప్రభుత్వమైనా సరే.. కేంద్రం అలాంటి పథకాన్ని అమలు చేసినప్పుడు దాన్ని సమీకృతపరిచి అమలు చేయడం అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతున్న ప్రక్రియ. కానీ సాదారణంగా కేంద్రం సాయం ఉన్నా అవి దాచిపెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నట్లుగా చెబుతాయి. కానీ, జగన్ మాత్రం ఈ పథకానికి పీఎం కిసాన్ యోజనను కూడా అనుసంధానం చేశారు.