దసరా ముందు వరకు తెలంగాణాలో దాదాపుగా అంతా సవ్యంగా ఉన్నది. ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసులు ఇవ్వడం, దాన్ని తెరాస పార్టీ పెద్దగా సీరియస్ గా తీసుకోకపోవడంతో ఒక్కసారిగా వేడి రగులుకుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. గత 11 రోజులుగా సమ్మె జరుగుతున్నది. సమ్మె జరుగుతున్నా.. తెరాస ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా సమ్మెకు దిగి కార్మికులు సొంతంగా ఉద్యోగాలు పోగొట్టుకున్నారని చెప్పింది.
దీంతో సమ్మెను మరింతగా ఉదృతం చేశారు. సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకూడదని చెప్పి ప్రైవేట్ బస్సులను తిప్పుతున్నారు. తాత్కాలికంగా ఉద్యోగులను నియమించారు. తాత్కాలిక ఉద్యోగులను నియమించి బస్సులను నడుపుతున్నారు. అయితే, బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇదిలా ఉంటె, తెలంగాణాలో జరుగుతున్న విషయాలను తెలుసుకోవడాని గవర్నర్ ను ఢిల్లీకి రమ్మని చెప్పడంతో.. తెలంగాణ గవర్నర్ తమిళిసై
ఢిల్లీ వెళ్ళింది.
ఈ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆమె ప్రధాని మోడీని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించబోతున్నారు. ఈ విషయాలతో పాటుగా ఆర్టీసీ సమ్మె గురించి కూడా ఆమె మోడీకి వివరించబోతున్నారు. అటు అమిత్ షాను కూడా ఆమె ఈరోజు కలవబోతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయం గురించి అమిత్ షాకు వివరించబోతున్నట్టు తెలుస్తోంది.
ఇక ఇదిలా ఉంటె, రాష్ట్రంలో పోలీసుల సెలవులను రద్దు చేసింది. ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. ఈనెల 19 వ తేదీన తెలంగాణ రాష్ట్ర బంద్ కు ఆర్టీసీ జేఏసీ పిలుపును ఇచ్చింది. ఈ బంద్ కు ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలపడంతో.. బంద్ సంపూర్ణంగా కొనసాగే అవకాశం ఉన్నది. ఒకవేళ బంద్ సంపూర్ణంగా జరిగితే.. దానివలన ప్రభుత్వానికి మచ్చ వచ్చే అవకాశంలేకపోలేదు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.