ఉద్యమాల పురిటిగడ్డగా పేరుగాంచిన ఉస్మానియా విశ్వవిద్యాలయంవిద్యాపరంగానే కాకుండా ఉద్యోగాల సాధనకు ఊపిరిలూదుతోంది. దశాబ్దాల తన కీర్తి చరితను నలుదిశలా చాటుతోంది. ఇక్కడ చదువుకున్న విద్యార్థుల్లో సుమారు 3 వేల మంది కానిస్టేబుళ్లుగా, 200 మంది ఎస్ఐలుగా ఇటీవల నియమితులయ్యారు. తమ ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చుకున్నారు. యువతరానికి సరికొత్త నిర్వచనం చెప్పారు. కుటుంబాలకు ఆసరాగా నిలిచారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఇంత మంది ఓయూ విద్యార్థులు ఉద్యోగాలు పొందడం ఇదేతొలిసారి కావడం గమనార్హం.
ఉస్మానియా యూనివర్సిటీ: వారంతా ఉన్నత విద్య పూర్తి చేశారు. తాము కోరుకున్న ఉద్యోగం రాకున్నా తొలుత ఏదో ఒక దాంతో ఉపాధి పొందాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా వేలాది మంది ఓయూ విద్యార్థులు పోలీసు ఉద్యోగాలకు పోటీపడ్డారు. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా సివిల్, ఏఆర్, సీపీఎల్, టీఎస్ఎస్పీ, ఎస్పీఎఫ్, ఫైర్ తదితర విభాగాల్లో 16,925 కానిస్టేబుల్ ఉద్యోగాలకు, 1,275 ఎస్ఐ ఉద్యోగాలకు రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్లు, ఇంటర్వ్యూలు జరిగాయి. ఇందులో క్యాంపస్తో పాటు ఓయూ చుట్టూ ఉన్న మాణికేశ్వర్నగర్, విద్యానగర్, తార్నాక, నల్లకుంట, హబ్సిగూడ, రాంనగర్, మెట్టుగూడ, లాలాగూడ, అంబర్పేట్, ఉప్పల్ తదితర ప్రాంతాలకు చెందిన ఓయూ విద్యార్థులు, నిరుద్యోగులు ఇక్కడి గదుల్లో ఉంటూ యూనివర్సిటీ లైబ్రరీలో రోజుల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టారు. ఓయూ క్రీడా మైదానాల్లో ఫిజికల్ టెస్టులకు ప్రాక్టీస్ చేశారు.పోలీసు ఉద్యోగాలు సాధించారు. వీరిలో ఎక్కువగా మహిళలే ఉండటం విశేషం.
పేదరికాన్ని జయించి..
ఇక్కడ ఉన్నత విద్య అభ్యసించినవారు పేదరికం కారణంగానే చిరు ఉద్యోగాలకు సైతం పోటీపడుతున్నారు. వ్యవసాయం, వ్యవసాయ కూలీలు, ఇతర పనులు చేసుకునే పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు పీజీ, పీహెచ్డీ వరకు చదవాలంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడాలి. ఉన్నత విద్యను పూర్తి చేసినా ఉద్యోగం రాకుంటే కుటుంబానికి ఆసరా ఉండదు. ఉద్యోగం వస్తేనే విద్యావంతులకు ఒక గుర్తింపు ఉంటుందనే భావన వీరిలో పెరిగింది.
ఉపాధే లక్ష్యంగా..
తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన పేద విద్యార్థులు ఓయూ క్యాంపస్లో చదువుతున్నారు. పీజీ, పీహెచ్డీలు పూర్తి చేసినా అనుకున్న ఉద్యోగం లభించడంలేదు. వీఆర్ఏ, వీఆర్ఓ మొదలు రైల్వే గ్యాంగ్మన్, కండక్టర్, క్లర్క్, కానిస్టేబుల్, అటెండర్ తదితర కింది స్థాయి ఉద్యోగాలకు పోటీపడి ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడుతున్నారు. ఇలా ఓయూలో విద్యనభ్యసిస్తున్న వారు ఉపాధే లక్ష్యంగా శ్రమించారు. కొన్ని సంవత్సరాలుగా వివిధ పోటీ పరీక్షలకు ఎంతో ఓపికగా, కష్టపడి చదివారు. రోజుకు 6 నుంచి 10 గంటల వరకు లైబ్రరీకే పరిమితమయ్యారు. కొందరు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. అన్ని పోటీ పరీక్షలకు చదివేందుకు ఓయూ క్యాంపస్ అనుకూలంగా ఉండటం వీరికి అనుకూలమైంది. లైబ్రరీతో పాటు ల్యాండ్స్కేఫ్ గార్డెన్, క్యాంపస్లో విస్తరించిన చెట్ల నీడ చదువుకునేందుకు వీలుగా మారాయి. ఎట్టకేలకు తమ కల ఫలించి, ఉద్యోగాలు సాధించామని ఆనందం వ్యక్తంచేశారు. ఎస్ఐ పోస్టులకు ఎంపికైన పలువురు ఇలా అభిప్రాయపడ్డారు.