నాయకులు బయటకు కదలాలి అంటే మంది మార్బలం ఉండాలి. ఇక ఒక సామాన్య మంత్రి బయటకు వెళ్తున్నాడు అంటే సరంజామా, హంగామా ఆంతా ఉంటుంది. అదే ఒక ముఖ్యమంత్రి బయటకు వెళ్తే.. పెద్ద కాన్వాయ్.. ట్రాఫిక్ క్లియర్.. రూట్ మ్యాప్ అన్ని ఉండాలి. రాజ్యాంగపరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాలి. కానీ, ఓ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి మాత్రం వాటిని పక్కన పెట్టారు.
సొంత రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు, పర్యాటకులను ఆకర్షించేందుకు తమ రాష్ట్రం ఎలా ఉంటుందో, ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో తెలిపేందుకు అయన 122 కిలోమీటర్లమేర బైక్ మీద ఒంటరిగా ప్రయాణం చేశారు. ఒకరాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరికి చెప్పకుండా ప్రయాణం చేయడం అంటే మాములు విషయం కాదు.
పాలన ఒక్కసారిగా స్తంభించిపోతుంది. కానీ, ఆయన అన్నింటిని సెట్ చేసుకొని రంగంలోకి దిగాడు. అయన ఎవరో కాదు.. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ.. అరుణాచల్ ప్రదేశ్ అంటేనే అద్భుతమైన రాష్ట్రం. పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే ప్రదేశాలు అక్కడ ఎన్నో ఉన్నాయి. దేశంలో మొదటి సూర్యకిరణాలు ప్రసరించే ప్రాంతం కూడా అరుణాచల్ ప్రదేశ్ లోనే ఉన్నది. అలాంటి అరుణాచల్ ప్రదేశ్ లోని పాసీఘాట్ ప్రాంతం బైక్ రైడింగ్ కు, సాహసక్రీడలకు పెట్టింది పేరు. నిత్యం అక్కడ బైక్ రైడింగ్ చేసేందుకు కుర్రకారు ఎక్కువగా వస్తుంటారు.
వాటిని ప్రమోట్ చేసేందుకు పెమాఖండూ పూనుకున్నారు. అక్టోబర్ 13 ఉదయం 8:00 గంటలకు యంగ్ కియాంగ్ నుంచి రాయల్ ఎన్ ఫీల్డ్ 650 బైక్ పై బయలుదేరి..ఉదయం 10:30 గంటలకు పాసీఘాట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మొత్తం 122 కిలోమీటర్ల ప్రయాణం అద్భుతంగా సాగినట్టు అద్భుతమైన రైడింగ్ అని అయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను అయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో కూడా అయన
సల్మాన్ ఖాన్ తో కలిసి సైకిల్ పై ప్రయాణం చేసి అందరిని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.