వీరసావర్కర్‌ పేరు భారత రత్నకు సిఫార్సు చేస్తామన్న బీజేపీ ప్రకటన రాజకీయంగా దుమారం రేపుతోంది. మహారాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కమలనాథులు..తాము మరోసారి అధికారంలోకి వస్తే వీరసావర్కర్‌కు భారత రత్న వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఇక ఈ దేశాన్ని దేవుడే రక్షించాలంటూ కాంగ్రెస్ విరుచుపడింది. సావర్కర్ తర్వాత గాడ్సే పేరును కూడా ప్రతిపాదిస్తారేమోనంటూ వామపక్షాలు ఫైర్ అయ్యాయి. 


మహారాష్ట్ర ఎన్నికల వేడి దేశాన్ని తాకింది. ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు ఇస్తున్న హామీలు వివాదాస్పదంగా మారుతున్నాయి. మహారాష్ట్రలో తిరిగి అధికారంలోకి వస్తే.. హిందుత్వ సిద్ధాంత రూపకర్త, వీరసావర్కర్‌కు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న కోసం ప్రయత్నిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రస్తావించింది. సావర్కర్‌తోపాటు మహాత్మా ఫూలే, సావిత్రిభాయ్ ఫూలేకు  భారతరత్న కోసం కేంద్రానికి సిఫారసు చేస్తామని చెప్పింది.  


సావర్కర్‌ పేరును భారతరత్నకు ప్రతిపాదించాలన్న బీజేపీ ఆలోచనపై విపక్షాలు మండిపడుతున్నాయి. గాంధీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడంటూ విద్యార్ధులకు ఎగ్జామ్‌లో ప్రశ్నలు ఇచ్చిన దేశంలో సావర్కర్ లాంటి వారికి భారతరత్న కూడా వస్తుందంటూ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. మహాత్మ గాంధీ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి భారత రత్న ఎలా ప్రతిపాదిస్తారని కాంగ్రెస్ ప్రశ్నించారు. ఓ వైపు గాంధీ 150వ జయంతి వేడుకలు నిర్వహిస్తూ ఆయన్ను పొట్టనపెట్టుకున్న వారిని అత్యున్నత పురస్కారాలతో గౌరవిస్తారా అంటూ ప్రశ్నించింది.  


వామపక్షాలు కూడా బీజేపీ మేనిఫెస్టో హామీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వీరసావర్కర్ తర్వాత గాంధీని హత్య చేసిన గాడ్సేకు కూడా భారత రత్న ఇస్తారేమోనని సీపీఐ విమర్శించింది. రెండు దేశాల సిద్ధాంతాన్ని బలపరిచి గాంధీ హత్యలో భాగస్వామిగా ఉన్న వ్యక్తికి భారత రత్న ఎలా ప్రతిపాదిస్తారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు.  మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా బీజేపీ మేనిఫెస్టోలో చేసిన ప్రస్తావన అగ్ని రాజేసింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: