గత 12 రోజులుగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె కారణంగా ఎక్కడ బస్సులు అక్కడే ఆగిపోయాయి. ఇలా ఆగిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మాత్రం అరకొర ఏర్పాట్లు చేస్తూ ఏదోలా నెట్టుకొస్తుందన్న అపవాదు వస్తున్నది. అటు కోర్టుకూడా తెరాస ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తున్నది. సమ్మె విషయంలో ప్రభుత్వానికి ముందు చూపులేదని, అభివృద్ధి విషయంలో వెనకబడి ఉందని, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు అభివృద్ధి విషయంలో ముందున్నాయని, అందుకే వాటికి నిధులు వస్తున్నాయని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
ఇక ఇదిలా ఉంటె, హైకోర్టులో సమ్మె విషయంలో అనేక పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. సమ్మెకు సంబంధించిన పరిష్కారం కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ప్రభుత్వం దీనిపై స్పందించింది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా రెండు రోజుల్లో కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని ఆదేశించింది. దీనిపై చర్చలు జరిపి అక్టోబర్ 18 వ తేదీన రిపోర్ట్ దాఖలు చేయాలనీ ఆదేశించింది. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విశేషం.
ఇప్పుడు హైకోర్టు ఓ అడుగు ముందుకేసి ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన జీతాలను విధిగా చెల్లించాలని, సోమవారం లోపుగా జీతాలు చెల్లించాలని కోరింది. సెప్టెంబర్ మాసానికి చెందిన జీతాలు ఇప్పటి వరకు చెల్లించలేదు. సెప్టెంబర్ 1 లేదా 2 వ తేదీల్లో జీతాలు ఇవ్వాలి కానీ, సమ్మె నోటీసులు ఇవ్వడంతో కావాలనే జీతాలు ఇవ్వకుండా తొక్కిపెట్టిందని కార్మికులు అంటున్నారు.
జీతాలు చెల్లించేందుకు తగిన స్టాఫ్ లేరని సోమవారం లోపుగా జీతాలు చెల్లిస్తామని పేర్కొన్నది. ఈ వార్త ఆర్టీసీ కార్మికులకు ఓ శుభవార్తే అని చెప్పాలి. హైకోర్ట్ ఇచ్చిన తీర్పును ఆర్టీసీ కార్మికులు స్వాగతించారు. అలానే ప్రభుత్వం తమను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్ట్ ప్రభుత్వానికి సూచించడంతో ఉద్యోగాలు ఎక్కడికి పోవని కార్మికులకు ఒక ధైర్యం వచ్చింది.