మహారాష్ట్ర ఎన్నికల్లో ఓట్‌ బేస్‌ పెంచుకునేందుకు ఎమ్‌ఐఎమ్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ విస్తృతంగా ప్రచారం చేస్తువ్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణం లేని మజ్లిస్‌... బీజేపీశివసేనతో ఢీ కొట్టగలదా? గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే మెరుగైన విజయాన్ని కైవసం చేసుకోగలదా? 


ఇప్పుడు దేశంలోని రాజకీయ పక్షాల కళ్ళన్నీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పైనే ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోనే ఎక్కువ జనాభా ఉన్న రాష్టాల్లో మహారాష్ట్రది రెండో స్థానం. ఆ రాష్ట్రంలోని 288 అసెంబ్లీ స్థానాలకు గాను ప్రధానంగా ద్విముఖ పోరే ఉన్నా... కొన్ని నియోజకవర్గాల్లో బహుముఖ పోరు నెలకొంది. బీజేపీ-శివసేన, కాంగ్రెస్‌-ఎన్సీపీ ప్రత్యర్ధులుగా తలపడుతుంటే... ముస్లిం, దళిత ఓట్‌ బ్యాంక్‌ ఎక్కువ ఉన్న చోట్ల ఎమ్‌ఐఎమ్‌ తన అభ్యర్ధుల్ని బరిలో నిలబెట్టింది. అంబేద్కర్‌ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్‌ నేతృత్వంలోని వీబీఏ వేరేగా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అయితే వీరి ప్రభావం నామమాత్రమే. మహారాష్ట్రలో పట్టు కోసం ఒవైసీ సోదరులు చేస్తున్న ప్రయత్నం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్‌పీ, 26 మంది కార్పొరేటర్ల బలం ఎమ్‌ఐఎమ్‌కు మహారాష్ట్రలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 24 చోట్ల పోటీ పడిన ఒవైసీ బ్రదర్స్‌ ఈసారి ఈ సంఖ్యను దాదాపు రెండింతలు చేశారు. 44 మంది అభ్యర్ధులు గాలిపటం గుర్తు పై ఎన్నికల బరిలో నిలబడ్డారు. వీరిలో పావు వంతు దళిత అభ్యర్ధులు కాగా మిగిలిన వారు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు.


ముస్లిం ఓట్‌ బ్యాంకే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఒవైసీ సోదరులు ఆ వర్గ జనాభా 10శాతం కంటే ఎక్కువగా ఉన్న 10 జిల్లాల పై ప్రధానంగా దృష్టి సారించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుంచి ముస్లిం మైనార్టీలు, దళితుల పై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయనే అభిప్రాయం నేపథ్యంలో ఎమ్‌ఐఎమ్‌ ...వీరిని తన వైపుకు తిప్పుకునేందుకు శక్తులన్నీ ఉపయోగిస్తోంది. దీనితో పాటు కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ఎన్‌ఆర్‌సీ అంశాలు చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల నేపథ్యంలోనే కాషాయదళం ఈ అంశాలను వ్యూహాత్మకంగా తెర మీదకు తీసుకువచ్చిందన్న వాదనా  ఉంది. వీటి వల్ల హిందూ వర్గ ఓట్‌బ్యాంక్‌ కన్సాలిడేట్‌ అయితే అదే సమయంలో ముస్లిం మైనార్టీ వర్గం కూడా ఎమ్‌ఐఎమ్‌ వైపు చూసే అవకాశాలను కొట్టి పారేయలేం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ అంశాల పై ఎమ్‌ఐఎమ్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ బీజేపీని టార్గెట్‌ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నా... కాంగ్రెస్ ను కూడా వదలడం లేదు. ఈ వ్యూహం ద్వారా ఎమ్‌ఐఎమ్‌ గెలుపు అవకాశాలు పెరగటం కంటే బీజేపీ వ్యతిరేక ఓట్‌ బ్యాంక్‌ చీలటానికే ఎక్కువ అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. 


ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ముస్లిం వర్గాలకు భరోసా ఇచ్చే పార్టీగా గుర్తింపు తెచ్చుకోవటం ఎమ్‌ఐఎమ్‌ ప్రధాన బలంగా మారింది. అసదుద్దీన్‌ ఒవైసీ వన్ మ్యాన్‌ ఆర్మీలా తమ అభ్యర్ధులు పోటీ చేస్తున్న అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. చాలా చోట్ల ఆయనే డోర్‌ టు డోర్‌ క్యాంపైన్‌ నిర్వహిస్తూ ఓటర్లతో వ్యక్తిగత సంబంధం ఏర్పరుచుకునే  ప్రయత్నంలో ఉన్నారు. బహిరంగ సభలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో పార్టీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అయితే రాష్టం పై గట్టి పట్టున్న బీజేపీ-శివసేన ఓట్‌ బ్యాంక్‌ను కదల్చగలిగే సత్తా ఎమ్‌ఐఎమ్‌కి ఉందా అంటే లేదనే చెప్పాలి. సభలకు వచ్చే జనాలకు ఓటింగ్‌ వరకు తీసుకువెళ్ళగలిగే క్షేత్ర స్థాయి నిర్మాణం పార్టీకి లేకపోవటం ఎన్నికల్లో విజయవకాశాలను దెబ్బ తీసే అవకాశం ఉంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  మహా ఎన్నికల్లో ఎమ్‌ఐఎమ్ ఎంత వరకు సత్తా చాటుతుంది, ఎవరి ఓటుబ్యాంక్ ను దెబ్బకొడుతుందనేది ఆసక్తికరంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: