పుట్ట గొడుగుల కోసం ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదం ఒకరి హత్యకు దారితీసింది. ఇరు కుటుంబాలు చెరోకరు టీడీపీ-వైసీపీకి చెందినవి కావడంతో ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. కొత్తూరు మండలం కుంటిభద్ర కాలనీలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కామక జంగం(57) గడ్డితొట్టిలో పుట్టగొడుగులు వెలిశాయి. వాటిని అదే కాలనీకి చెందిన కొవ్వాడ ఎర్రయ్య దొంగిలించాడని జంగం ఆరోపించాడు.
ఇంటి వద్దకు వెళ్లి ఇదే విషయమై నిలదీశాడు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాలు ఒకరినొకరు నెట్టుకుంటూ కొట్లాటకు దిగారు. ఇది చినికిచినికి గాలి వానగా మారింది. ఇరువర్గాలు పరస్పరం కర్రలతో,బల్లేలతో దాడి చేసుకున్నారు.ఇదే క్రమంలో కొవ్వాడ ఎర్రయ్య అనే వ్యక్తి కామక జంగంపై బల్లెంతో దాడి చేశాడు. దీంతో జంగం అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే కొత్తూరు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యురాలు
దీపిక ధ్రువీకరించారు.కాగా,మృతుడు జంగం ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరినట్టు తెలుస్తోంది.
అయితే తాము మరణ ధ్రువీకరణ చేయడానికి వీల్లేదని.. ఈసీజీ తియ్యాలంటూ పాలకొండ ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. కడుపులో ఉన్న బల్లెంతోనే 108 వాహనంలో పాలకొండ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుడికి సమీప బంధువైన కామక హిమగిరికి కూడా గాయాలయ్యాయి. ఎర్రయ్యతో పాటు జయ్యమ్మ కూడా తీవ్రంగా గాయపడ్డారు. మృతుడికి భార్య బోడెమ్మ, ఇద్దరు కుమారులు మిన్నారావు, చిరంజీవి ఉన్నారు. టీడీపీ వర్గీయులే అతనిపై దాడి చేశారని వైసీపీ వర్గం ఆరోపిస్తోంది.
మృతుడి భార్య బోడెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యానేరం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు కొత్తూరు సీఐ ఎల్.సన్యాసినాయుడు తెలిపారు. దీంతో సీఐ సన్యాసినాయుడు, ఎస్ఐ బాలకృష్ణల ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ప్రధాన నిందితుడు రాజుతో పాటు సహకరించిన తిరుపతిరావుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశముం ప్రస్తుతం గ్రామంలో 144 సెక్షన్ విధించినట్టు సమాచారం.