ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ పరిస్తితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాయకులు వరుసగా పార్టీని వీడుతూ చంద్రబాబుకు గట్టి షాకులు ఇచ్చేస్తున్నారు. మొదట్లో కొందరు బీజేపీలోకి వెళితే...తర్వాత వైసీపీలోకి వెళ్ళడం మొదలుపెట్టారు. సుజనా చౌదరీ బ్యాచ్ నుంచి మొన్న జూపూడి
ప్రభాకర్ వరకు టీడీపీని వీడిన నేతలే. అయితే టీడీపీలో ఈ గోడ దూకే బ్యాచ్ ఇంకా ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే మరికొందరు వైసీపీలోకి వెళ్లొచ్చని ప్రచారం జరుగుతోంది.
అందులో ముఖ్యంగా 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచి టీడీపీలోకి వచ్చిన వారే ఉన్నారని తెలుస్తోంది.
అందులో ముఖ్యంగా చిత్తూరు జిల్లా పలమనేరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కూడా టీడీపీ నుంచి తిరిగి వైసీపీలోకి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. 2014లో వైసీపీ టికెట్పై గెలిచిన ఆయన తర్వాత టీడీపీలోకి వచ్చి మంత్రి పదవి కూడా చేపట్టారు. ఇక మొన్న ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన అమర్నాథ్ జగన్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. జూపూడి లాగే తనని కరుణిస్తే త్వరలోనే వైసీపీ తీర్ధం పుచ్చుకోవచ్చు.
ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచి టీడీపీలోకి వచ్చి మంత్రి అయ్యి మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కూడా లగేజ్ సర్దేయోచ్చని తెలుస్తోంది. అలాగే రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోత్యుల నెహ్రూ. పాడేరు మాజీ ఎమ్మెల్యే గిద్ది ఈశ్వరిలు కూడా మళ్ళీ సొంతగూటికి వెళ్ళేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది.
వీరే గాక కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత రామసుబ్బారెడ్డి, అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె తనయ శింగనమల మాజీ ఎమ్మెల్యే
యామిని బాల కూడా వైసీపీలోకి వెళ్లిపోవచ్చని ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ఈ మాజీల జంపింగులు ఎప్పుడు మొదలవుతాయో.