ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే వివిధ వర్గాలపై కాసుల వర్షం కురిపించారు. ఇప్పుడు మరో వర్గంపై వరాల జల్లు కురిపించారు. ఆయా వర్గాలకు లబ్ధి చేకూర్చుతూ కేబినెట్ మీటింగ్లో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పలు సంక్షేమ పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ మీటింగ్ వివరాలను పేర్ని నాని మీడియాకు వివరించారు.
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి ..ఏ కుటుంబం అయితే మగ్గంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారో..ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం అందించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. సీఎం వైయస్ జగన్ తన పాదయాత్రలో చేనేత కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు కేబినెట్లో వైయస్ఆర్ నేతన్న నేస్తం అనే పథకాన్ని రూపొందిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ మాసం లోపు జాబితా అంతా కూడా గ్రామ సభల్లో అందుబాటులో ఉంచుతారు.
ఆ జాబితాలో తప్పులు ఉంటే సరిచేస్తారు. డిసెంబర్ 21వ తేదీ నుంచి వైయస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తారు. ఎంత మంది లబ్ధిదారులు ఉన్నా కూడా చేనేత వృత్తిగా బతుకుతున్న ప్రతి కుటుంబానికి ఆర్థికసాయం అందిస్తారు. నేతన్నలకు పండుగ లాంటి నిర్ణయం ఇది.
ఈ నిర్ణయంతో పాటు కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. చిరుధాన్యాలు, ఆపరాల బోర్డులు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు బోర్డు కృషి చేస్తుంది. గడిచిన ప్రభుత్వంలో పౌరసరఫరాల పేరుతో వారికి ఉన్న క్యాష్ క్రెడిట్ నిల్వలు రూ.20 వేల కోట్లు ఉన్నాయి. చంద్రబాబు ఆ డబ్బును డ్రా చేసి పసుపు-కుంకుమకు మళ్లించారు. ధాన్యం కొనుగోలు చేయాలంటే డబ్బులు లేకుండా చేశారు. అందు కోసం పౌరసరఫరాల సంస్థకు ఈ నిధులు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.