రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె విషయంలో కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు ఆర్టీసీకి కార్మికులతో చర్చలు జరపాలని ఆదేశిస్తే.. దానికి కాదని కెసిఆర్ చర్చలు జరిపేది స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఆర్టీసీ కార్మికుల్లో తీవ్రమైన అసంతృప్తిని కలుగజేసింది. అంతేకాకుండా, సమ్మె చేస్తున్న వాళ్ళను తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రసక్తి లేదని కూడా కెసిఆర్ స్పష్టంగా తెగేసి చెప్పేశారు. దీంతో కార్మికులు చేస్తున్న సమ్మె మరింత ఉదృతం కాబోతుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి.
హైకోర్టు చర్చలకు పిలవమని ఆదేశిస్తే.. కెసిఆర్ మాత్రం చర్చలు లేవని చెప్పేశారు. బతుకమ్మ,
దసరా సమయంలో సమ్మె చేయడం వలన ఆర్టీసీకి రూ. 150 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వచ్చాయని, ప్రజలు ఇబ్బందుల్లో పడిపోయారని న్యాయస్థానానికి వివరించాలని అధికారులకు ఆదేశించారు. ఈనెల 21 వ తేదీ నుంచి రాష్ట్రంలో తిరిగి పాఠశాలలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. అప్పటి వరకు రాష్ట్రంలో బస్సులు సక్రమంగా నడిచేలా చూడాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్ మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిందని, దీంతో వారికీ జీతాలు 66 శాతం వరకు పెరిగాయని, కానీ, కార్మికులు దానిని పట్టించుకోకుండా, సమ్మె చేస్తుండటం విడ్డూరంగా ఉందని, జీతాలు పెంచినా ఆర్టీసీ నష్టాలు తప్పలేదని, సమ్మె చేస్తున్న కార్మికులతో ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరిపేది లేదని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఇప్పుడు ఆర్టీసీ జేఏసీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది తెలియాలి.
ఈనెల 19 వ తేదీన తెలంగాణ బంద్ కు పిలుపును ఇచ్చారు. ఈ బంద్ ఎలా జరుగుతుంది అనే దానిపై అందరి దృష్టి ఉన్నది. బంద్ సంపూర్ణంగా జరిగింది అంటే.. కార్మికులు పైచేయి సాధించినట్టు అవుతుంది. లేదు అంటే ప్రభుత్వం గెలిచినట్టు అవుతుంది. అంతేకాదు, రేపటి రోజున కోర్టులో ప్రభుత్వం ఏమని సమాధానం ఇవ్వబోతుంది అన్నది కూడా ఉత్కంఠభరితంగా మారింది.