ఏ రాజకీయ పార్టీ అయినా
జనాలిచ్చే విరాళాలతోనే కార్యక్రమాలు చేస్తుంటాయి. ఇక్కడ జనాలంటే పార్టీ నేతలు,
కార్యకర్తలు ఇచ్చే చందాలు కాదులేండి. నిజంగా వారిచ్చే చందాలతోనే పార్టీ నడపాలంటే
ఒక్కరోజు కూడా పార్టీ నడవదు. పార్టీ నడవాలంటే మహరాజ పోషకులు వేరే ఉంటారు. వారే
పారిశ్రామికవేత్తలు, సానుభూతిపరులు అండ్ కో అన్నమాట.
ఈ విషయంలో తెలుగుదేశంపార్టీ పరిస్ధితి ఏమిటో తెలీటం లేదు కానీ వైసిపికి మాత్రం విరాళాలు బ్రహ్మాండంగానే వచ్చినట్లు లెక్క. 2018-19 అంటే ఎన్నికలకు ముందు వరకూ వైసిపికి వచ్చిన విరాళాలు రూ. 80 కోట్లు. ఈ విషయాన్ని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి స్వయంగా ఎన్నికల కమీషన్ కు సమర్పించిన లెక్కలే చెబుతున్నాయి.
తెలుగురాష్ట్రాల్లో రాజకీయాలు బాగా ఖరీదైపోయిన విషయం అందరూ చూస్తున్నదే. అదికూడా 1995లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రయిన దగ్గర నుండి ఎన్నికలు చాలా ఖరీదైపోయాయి. కాబట్టి టిడిపికి కూడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు భారీగా విరాళాలు ఇవ్వటం మొదలుపెట్టారు. దాంతో ప్రాంతీయపార్టీల్లో టిడిపి అత్యంత బలోపేతమైన పార్టీగా మారింది.
ఈ నేపధ్యంలోనే మొన్నటి ఎన్నికలకు ముందు వైసిపికి కూడా పారిశ్రామికవేత్తలు పెద్ద మొత్తాల్లోనే విరాళాలు ఇచ్చారంటే ఆశ్చర్యంగానే ఉంది. విశాఖపట్నం ఎంపి, పార్టీ నేత కంపెనీలు ఎంవివి సత్యనారాయణ రూ 11 కోట్లు, జగన్ సొంత కంపెనీలు రూ. 1.75 కోట్లు ఇచ్చాయి. చాలా కంపెనీల నుండి 1.35 కోట్లు, 1.5 కోట్ల చొప్పున విరాళాలొచ్చాయి.
ప్రతిపక్షంలో ఉన్న వైసిపికే ఈ స్ధాయిలో విరాళాలొస్తే అధికారంలో ఉన్న చంద్రబాబుకు ఏ స్ధాయిలో విరాళాలొచ్చుండాలి. అందులోను విరాళాల సేకరణలో చంద్రబాబు ఆరితేరిపోయాడు. ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలంతా తనతో నిత్యం టచ్ లో ఉంటారని చెప్పుకుని తిరిగే చంద్రబాబుకు విరాళాలకు కొదవేముంటుంది ?
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్నపుడు వైసిపి వ్యతిరేకించిన కొన్ని పరిశ్రమలు కూడా జగన్మోహన్ రెడ్డికి లక్షల రూపాయల విరాళాలు ఇచ్చినట్లు ఎల్లోమీడియా చెబుతోంది. మరి వచ్చే ఎన్నికల్లోపు ఇంకెన్ని విరాళాలొస్తాయో చూడాలి.