అయోధ్య... హిందువుల పరమ పవిత్ర ప్రదేశం. సరయూ నది ఒడ్డున ఉన్న ఈ ప్రసిద్ధ ప్రాంతానికి పురాణేతిహాసాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. మాట తప్పని పరిపాలకుడు శ్రీరాముడు పుట్టిన ప్రదేశంగా చెప్పుకుంటారు. ఇది హిందువులు గట్టిగా విశ్వసిస్తారు. రామరాజ్యం కావాలని కోరుకునేవారంతా రాముడు ఆలయం అయోధ్యలో నిర్మాణం జరగాలని అంటారు. రాముడికి భవ్యమైన మందిరాన్ని నిర్మించే రోజు ఎపుడు వస్తుంది..
ఈ ప్రశ్నలు ఇలా ఉండగానే 152 ఏళ్ళుగా వివాదంలో ఉన్న అయోధ్యకు ముగింపు వచ్చే రోజుకు కౌంట్ డౌన్ మొదలైంది. అయోధ్య తీర్పు ఇపుడు రిజర్వ్ లో ఉంది. దాదాపుగా నలభై రోజుల పాటు ఏకధాటిగా దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అయోధ్య కేసు విచారించేందుకు తన నాయకత్వంలో అయిదుగురు సభ్యులతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.
ప్రతీ రోజు విచారణ జరిగిన ఈ కేసు నిన్నటితో విచారణ పూర్తి చేసుకుంది. ఇక తీర్పుని రిజర్వులో ఉంచారు. అయితే ఎపుడు తీర్పు వస్తుంది అన్న దాని మీద వివిధ రకాలుగా సమాధానాలు వస్తున్నాయి. రంజన్ గొగోయ్ వచ్చే నెల 17న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ విరమణ చేసేలోగా అయోధ్యపై తీర్పు చెప్పి చరిత్రలో నిలుస్తారని కూడా అంటున్నారు. ఆయన రిటైర్ అయ్యే నవంబర్ 17 ఆదివారం కావడంతో ఆయన పదవీవిరమణ టెక్నికల్ గా 16కే అయిపోతుంది.
దాంతో నవంబర్ 13, 14, 15 తేదీల్లో ఏదో ఒక రోజు అయోధ్యపై తీర్పు వెలువరిస్తారని అంటున్నారు. ఇంతటి విశిష్టత కలిగిన చారిత్రాత్మకమైన ఆ తీర్పు వచ్చే డేట్ ఏదీ అన్నదే ఇపుడు చర్చగా ఉంది. ఈ మూడు తేదీలలో ఏ డేట్ న తీర్పు వచ్చినా అది చరిత్రలో నిలిచిపోయే రోజు అవుతుందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా అయోధ తీర్పుపై ఓ వైపు హిందూ సంస్థలు, మరో వైపు ముస్లిం సంస్థలు కూడా తమకే అనుకూలం అనుకుంటున్నాయి. మరి ఈ తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.
కొందరు ముస్లిం నాయకులు, సంఘాలు మాత్రం అయోధ్యలో స్థలాన్ని హిందువులకు వదిలేసి ముస్లింలు ఎక్కువగా ఉండే లక్నో లాంటి చోట బ్రహ్మాండంగా బాబ్రీమసీద్ ను కట్టుకోవాలని ప్రతిపాదిస్తున్నారుట. మొత్తం మీద చూసుకుంటే అయోధ్య తీర్పుపై ఉత్కంఠ పెరిగిపోతోంది. మరో వైపు బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ బాబ్రీ మసీద్ కూలగొట్టిన డిసంబర్ 6వ తేదీనే అయోధ్యలో మందిర నిర్మాణానికి శ్రీకారం చుడతామని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో, తీర్పు ఎలా వస్తుందో.