టెండరింగ్ విధానం వల్ల కూడా మందు షాపులని వాటి మాఫియాను ఆపలేక పోతున్నారు.సిడికెట్లు గా మారి మరి దోచేద్దాం అని చూస్తున్నారు.రూ.2 లక్షల టెండర్ ఫీజు లాటరీలో అదృష్టం వరించకపోతే ఆ రూ.2 లక్షలు పోయినట్టే. అంటే అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రూ.2 లక్షలు సమర్పించుకోవాలన్నమాట అయినా మద్యం వ్యాపారులు, లిక్కర్ వ్యాపారంలో అడుగుపెట్టాలనుకునే ఆశావాహులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు.
రూ.2 లక్షలను కూడా ఖాతరు చేయలేదు. పోతే రూ.2లక్షలు వస్తే మద్యం దుకాణం అనే ధోరణిలో దరఖాస్తులు భారీగా సమర్పించారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలకు గాను టెండర్ల స్వీకరణ గడువు ముగిసిన బుధవారం నాటి రాత్రికి ఎక్సైజ్ అధికారుల లెక్కల ప్రకారం 44 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం ఒక్కరోజే 20 వేలకు పైగా దరఖాస్తులు సమర్పించారు. ఎక్సైజ్ డీసీ కార్యాలయాలు కిక్కిరిసిపోవడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి మరీ దరఖాస్తులు స్వీక రించాల్సి వచ్చింది. దీంతో అర్ధరాత్రి వరకు ఎక్సైజ్ అధికారులు ఈ టెండర్ల స్వీకరణ, పరిశీలనలో బిజీ అయిపోయారు. కేవలం దరఖాస్తుల ద్వారానే సర్కారుకు ఏకంగా రూ.880 కోట్లకు పైగా ఆదాయం కేవలం టెండర్ ఫీజు రూపంలోనే వచ్చింది. 2017లో 2,216 దుకాణాలకు టెండర్లు పిలవగా 41 వేలకు పైగా దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.410 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు కూడా షాపుల సంఖ్య పెరగక పోయినా దరఖాస్తులు ఎక్కువగా రావడంతో గతేడాది కన్నా రూ.470 కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరనుంది.
బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకు అందిన సమచారం మేరకు. హైదరాబాద్ జిల్లాలో 173 మద్యం దుకాణాలకు గాను 1,319 దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధిక దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 261 దుకాణాలకు గాను, 7,534 దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 278 దుకాణాలకు 6,963 దరఖాస్తులు వచ్చాయి. సూర్యాపేట జిల్లాలో సరాసరి ఒక్కో దుకాణానికి 30కి పైగా దరఖాస్తులు వచ్చాయి. సిద్దిపేట జిల్లాలో 70 దుకాణాలకు వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయి. వరంగల్, రంగారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోనూ ఆశావహుల పోటాపోటీగా దరఖాస్తులు సమర్పించారు. అయితే అధికారికంగా ఈ దరఖాస్తుల సంఖ్యపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు.ఇలా వెనకా ముందు చూడకుండా చేసే ఈ దందా ఎన్ని లాభాలను తెస్తుందో,ఎన్ని ఘోరాలను మిగులుస్తుందో,దీనికి ముగింపు ఎప్పుడో అంటూ జనం వాపోతున్నారు.