పట్టణాలు, నగరాల్లో ఎన్నిరకాలైన సౌకర్యాలు, వెసులుబాట్లు ఉంటాయో....అదే రీతిలో కొన్ని సమస్యలు, ఇబ్బందులు కూడా ఉంటాయి. అలాంటి అంశంలోనే తాజాగా దేశరాజధాని
ఢిల్లీ మళ్లీ తెరమీదకు వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ సరి-బేసి విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు సరి-బేసి విధానంలో వాహనాలు రోడ్డు ఎక్కాల్సి ఉంటుంది. ఆదివారాలు మినహాయింపు ఉంటుందన్నారు. సరి-బేసి విధానాన్ని ఉల్లంఘిస్తే 4వేల జరిమానా విధించనున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా ఈ నిర్ణయం గురించి తెలిపారు.నవంబర్ 4 నుంచి 15వ తేదీ వరకు సరి-బేసి సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కాల్సి ఉంటుందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే వాహనాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు. నాన్ ట్రాన్స్పోర్ట్ ఫోర్వీలర్ వాహనాలకు సరి-బేసి విధానం అమలవుతుందన్నారు. ద్విచక్ర వాహనాలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు సీఎం చెప్పారు.
కాగా, అయితే సరి - బేసి విధానం అమలులో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఆదేశాల నుంచి అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారికి మినహాయింపు కల్పించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లోక్సభ స్పీకర్, కేంద్ర మంత్రులు, రాజ్యసభ, లోక్సభ పక్ష నేతల వాహనాలతో పాటు, రాష్ర్టాల ముఖ్యమంత్రుల వాహనాలకు, సుప్రీంకోర్టు జడ్జిలకు, యూపీఎస్సీ చైర్పర్సన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎన్నికల కమిషనర్లు, కాగ్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, లోక్సభ డిప్యూటీ స్పీకర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ హైకోర్టు జడ్జీలు, లోకాయుక్త వాహనాలకు, ఎమర్జెన్సీ సర్వీసులకు ఈ విధానం నుంచి మినహాయింపు కల్పించినట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలకు కూడా ఈ విధానం నుంచి వెసులుబాటు కల్పించారు. అయితే,ఢిల్లీ సీఎం, మంత్రులకు మాత్రం మినహాయింపు కల్పించలేదు.