రాజకీయాలలో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయి అని అంటారు. కేసీఆర్ కూడా గోటితో పోయేవాటిని గొడ్డలి దాకా తెచ్చుకుంటూ తనకు తానే నష్టం చేసుకుంటున్నారు. అసలు కేసీఆర్ కు అన్ని వైపుల నుండి అపద ముంచుకోస్తున్నా ఏమి పట్టనట్టు వున్నాడు. కానీ రేపు ఏలా వుంటుందో ఏవరు చెప్పలేని పరిస్థితికి వచ్చింది. మొత్తంమీద ప్రభుత్వం ఉందా? అంటే.. ఉంది అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పూనుకున్నారు. ఈ సమస్యపై ఉన్నతస్థాయి సమావేశం అంటూ రెండు రోజులపాటు గంటల తరబడి భేటీ అయిన కేసీఆర్.. సమ్మెలో ఉన్నవారందరూ ఉద్యోగాలు కోల్పోయారు అని ప్రకటించారు. నిజానికి అన్ని గంటలపాటు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించే బదులు కార్మిక సంఘాల నాయకులతో ఒక గంటపాటు సమావేశమై నాలుగు మంచి మాటలు చెప్పి ఉంటే సమస్య పరిష్కారం అయ్యేది.
తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని నాయకుడిగా ఎదిగిన అశ్వత్థామరెడ్డి సమ్మెకు పిలుపునిస్తే నేను తగ్గడం ఏమిటన్న ధోరణిని కేసీఆర్ ప్రదర్శించడం వల్లనే సమస్య జటిలమైంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలను గమనిస్తుంటే.. 1989కి పూర్వం ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్.టి.రామారావు చర్యలు గుర్తుకు వస్తున్నాయి. ఎన్టీఆర్ ఇంకే తప్పు చేయకుండా ఉంటే 1989లో మళ్లీ అధికారంలోకి వస్తామని అప్పట్లో తెలుగుదేశం నాయకులు అంటూ ఉండేవారు. వారు అలా అభిప్రాయపడిన మరునాడే ఎన్టీఆర్ ఏదో ఒక తప్పిదం చేసేవారు. దీంతో తెలుగుదేశం నాయకులు నీరుగారిపోయేవారు. కేసీఆర్ కూడా ఇప్పుడు రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయి కేబినెట్ లేకుండా రెండు నెలలు కాలక్షేపం చేశారు. ఇలాంటి చిన్న చిన్న తప్పులె రేపటికి పెద్దవి అయ్యి మోత్తానికే ఏసరు పెడతాయి. కాని ఇలాంటివి మామూలే అని
కేసీఆర్ తీసిపడేస్తున్నాడు. ఇప్పుడు తెలంగాణాలో కూడా అధికారులు ఏవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారని బలంగా వినపడుతుంది.
ఉద్యోగ సంఘాల నాయకులకు ఏడాదిగా అపాయింట్మెంట్ కూడా ఇవ్వని కేసీఆర్.. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా కొంతమంది నాయకులను పిలిపించుకుని భోజనం పెట్టి మరీ మీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చి పంపించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఒక నేత ఒకటి రెండు సమస్యలను ప్రస్తావించబోగా.. ‘‘గచ్చిబౌలిలో మీరు నిర్మించుకుంటున్న విల్లా పనులు ఎలా జరుగుతున్నాయి?’’ అని కేసీఆర్ ఆరా తీయడంతో ఆ నేత మౌనాన్ని ఆశ్రయించవలసి వచ్చిందట. అంటే నాయకుల బలహీనతలను గుర్తించి దెబ్బతీసే ఎత్తుగడలను ముఖ్యమంత్రి ఎంచుకుంటున్నారని భావించాల్సి ఉంటుంది. నిజానికి ముఖ్యమంత్రిని కలిసిన నాయకులకు ఉద్యోగులపై పెద్దగా పట్టు లేదు. ఈ కారణంగా వివిధ స్థాయిలలో ఉద్యోగులు వారిని విమర్శించడం మొదలెట్టారు. రాష్ట్రంలో ప్రత్యర్థులందరూ ఏకతాటిపైకి రావడంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా కన్నెర్ర చేస్తున్నందున కేసీఆర్ ఉక్కపోతకు గురవుతున్నారని చెప్పవచ్చు. తనను ఇబ్బంది పెట్టవద్దని
ఢిల్లీ పెద్దలను అర్థించినా ముఖ్యమంత్రికి ఊరట లభించలేదని తెలిసింది.