ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపుల నిర్వహణను ప్రభుత్వమే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకుంది. ఈ సిబ్బంది అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయం ప్రకారమే విధులను నిర్వహిస్తూ.. విధులకు హాజరవుతూ మద్యం దుకాణాలను మెయింటైన్ చేస్తున్నారు. అంతేకాదు, మద్యం దుకాణాలలో ఒక్కో వ్యక్తికీ మూడు కంటే ఎక్కువ మద్యం బాటిళ్లు ఇచ్చేందుకు వీలులేదు. విధిగా ఆర్డర్లు పాస్ చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే అక్కడ విధులు నిర్వహిస్తున్నారు.
దీంతో పాపం మందుబాబులు మద్యం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. మూడు బాటిళ్లు సరిపోక పాపం ఏం చేయాలో తెలియక ఉసూరుమంటున్నారు. మరి ఎవరికీ వచ్చిందో తెలియదుగాని, మందుబాబులకు ఓ ఐడియా వచ్చింది. వచ్చిందే తడవుగా అమలు చేయాలని అనుకున్నారు. ప్రకాశం జిల్లాలోని కంభంలోని ఓ వైన్ షాప్ కు కన్నం వేసేందుకు ప్లాన్ చేశారు.
మాములుగా దొంగలు కన్నం వేస్తె.. వీటిని దొంగిలిస్తారు.. డబ్బు దొంగిలిస్తారు.. లేదనే నగలు వస్తువులు దొంగిలిస్తారు. కానీ, ఈ దొంగలు మాత్రం వెరైటీగా కంభంలోని వైన్ షాప్ కు దొంగతనానికి వెళ్లి కేవలం మద్యం బాటిళ్లు మాత్రమే దొంగతనం చేశారు. వైన్ షాప్ పైభాగం రేకులతో కప్పి ఉంచడంతో.. రేకులను తొలగించి దొంగలు లోపలికి దిగారు.
అలా లోపలికి వెళ్లిన దొంగలు మొత్తం పరిశీలించి చూసి ఎంసి విస్కీ బాటిళ్లు ఉన్న కేసును దొంగిలించారు. మిగతా వస్తువుల జోలికి వెళ్లలేదట. తరువాత రోజు షాప్ ఓపెన్ చేస్తే పైన కప్పుకు కన్నం వేసి ఉండటంతో పాపం సిబ్బంది షాక్ అయ్యారు. దొంగతనం జరిగిందనై తెలుసుకొని పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెగ్యులర్ దొంగలు చేసిన పని కాదని, మందుబాబులు ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు అంటున్నారు. ఆ దిశగానే దర్యాప్తు చేస్తున్నారు.