ప్రపంచంలో
టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది సైబర్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త పద్దతుల్లో సైబర్ మోసగాలు అమాయకులను టార్గెట్ చేస్తూ అందినంత దోచుకుంటున్నారు. ఓ వైపు ప్రభుత్వం సైబర్ మోసగాళ్ల వలలో చిక్కొదని ప్రజలను హెచ్చరించినా..అమాయకంగా మోసపోవడం తర్వాత లబోదిబో అంటూ ఫిర్యాదులు చేయడం సర్వసాధారణం అయ్యింది. తాజాగా ఇప్పుడు సైబర్ మోసగాలు కొత్త పద్దతుల్లో ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారు. ఢిల్లీ, నోయిడా కేంద్రంగా తిష్టవేసిన కొందరు సైబర్ నేరగాళ్లు ఇటీవల ఓ కొత్త ప్రకటనకు తెరతీశారు. ‘గూగుల్ పే పండగ ఆఫర్...మీరు రూపాయి జమ చేస్తే రెండు రూపాయలు మీ వ్యాలెట్లోకి వస్తాయి’ అంటూ ఫోన్లు చేస్తున్నారు.
ఇంకేముంది మొదట ఒకటీ రెండు రూపాయలతో టెస్ట్ చేస్తున్నారు కస్టమర్లు..నిజంగానే వారి వ్యాలెట్ లో డబుల్ అవుతూ వచ్చాయి. అంతే అత్యాశకు పోవడం వేలు, లక్షల్లో జమచేయడం చేశారు. తీరా డబ్బులు వ్యాలెట్ లో పడకపోవడంతో దిమ్మతిరిగి తాము దారుణంగా మోసపోయామని లబోదిబో అంటున్నారు. అయితే ఎవరైనా డబ్బులు ఊరికే ఎందుకు ఇస్తారన్న ఆలోచన ఏమాత్రం లేకపోవడం గమనార్హం. తీరా తాము సైబర్ మోసగాళ్ల చేతుల్లో మోసపోయామని తెలిసిన తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్కు చెందిన
మమత అనే మహిళకు ఇలాగే ఫోన్ వచ్చింది. ఆశపడిన ఆమె ట్రైల్గా రూ.10లు జమ చేసింది. వెంటనే ఆమె వ్యాలెట్కు రూ.20లు జమయ్యాయి. అంతే నిజంగానే ఎక్కువ డబ్బులు వేస్తే డబులు అవుతాయని ఆలోచించి ఏకంగా లక్షా 10 వేల రూపాయలు జమ చేసింది. తిరిగి డబ్బు రాలేదు. ఆందోళనతో ఆమె ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది. ఇంకేముంది తాను మోసపోయానని అర్థమైంది..పోలీసులను ఆశ్రయించడంతో ఈ బాగోతం వెలుగు చూసింది. అయితే ఈ మోసగాలళ్లు రోజుకు ఏకంగా రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు కాజేసినట్లు సమాచారం.
కాగా, ఈ మోసగాళ్లు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వైజాగ్, విజయవాడ, తిరుపతి, వరంగల్, కర్నూల్ ప్రాంతాల్లోని పలువురి నుంచి నేరగాళ్లు కోట్లమేర కాజేసినట్లు సమాచారం. మరోవైపు సైబర్ క్రైం పోలీసులు ఇటువంటి ఫోన్ కాల్స్ని నమ్మవద్దని సూచించారు.