ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలలో మన భారతీయులకు మాత్రం అమెరికా అనేది ఒక గొప్ప కల.. అమెరికా గురించి వర్ణిస్తూ ఎన్నో పాటలు., ఆటలు., ముచ్చట్లు చేస్తుంటారు. ఒక్క భారతీయులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది కలల దేశం అమెరికా. ఉంటానికో ఇల్లు., ఉద్యోగం., డబ్బు ఇవన్నీ మన దేశంలో కాకుండా అమెరికా లో ఉందని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా భావించే కొందరికి మాత్రం ఇప్పుడు వివిధ నిబంధనల కారణంగా నెరవేరడం లేదు. అలా అని అమెరికా మీదున్న కోరికా చావడం లేదు. అందుకే అడ్డదారులు వెతుక్కొని మరీ అక్రమ వలసదారులుగా అమెరికాలో చేరడానికి యత్నిస్తున్నారు. కానీ దొరికిపోతున్నారు. తాజాగా ఇలా మెక్సికో ద్వారా అమెరికాలోకి అక్రమంగా చొరబడాలని యత్నించిన 311 మంది భారతీయులను వెనక్కి పంపిన విషయం తెలిసిందే.
అమెరికాలో లీగల్గా సెటిల్ అయ్యే అవకాశం లేకపోవడంతో... అక్రమంగా ప్రవేశించేందుకు చాలా మంది విదేశీయులు మెక్సికో బోర్డర్ ద్వారా స్కెచ్ వేసుకుంటున్నారు. కానీ! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం మెక్సికో అక్రమ వలసల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తుండటంతో....మెక్సికో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇలాంటి అక్రమ వలసదారులను పట్టుకుంటున్నారు. తాజాగా ఇలా పట్టుబడిన వారిలో సుమారు 311 మంది భారతీయులున్నారు. దీంతో మెక్సికో ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని స్వదేశానికి పంపారు. ప్రత్యేక బోయింగ్ 747 విమానంలో బయలుదేరిన వారంతా ఇవాళ ఢిల్లీ చేరుకున్నారు.
మెక్సికో అధికారులు తిరిగి పంపింన వారిలో చాలా మందికి కనీస లగేజీ కూడా లేకపోయింది. గౌరవ్ కుమార్ అనే భారతీయుడు ఢిల్లీ చేరుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా వెళ్లేందుకు ఓ ఏజెంట్ ద్వారా ప్రయత్నించారని., అమెరికా వెళ్లాలన్న లక్ష్యంతో వ్యవసాయ భూమి, బంగారాన్ని అమ్మేశి సుమారు 18 లక్షల డబ్బును ఏజెంట్కు కట్టినట్లుగా చెప్పుకొచ్చాడు. అయితే తమ ఏజెంట్ అడవుల నుంచి అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడని., సుమారు రెండు వారాల పాటు అడవుల్లో నడిచామని ఆవేదన వ్యక్తం చేశాడు. మెక్సికో నుంచి అందర్ని డిపోర్ట్ చేసినట్లు గౌరవ్ తెలిపాడు.
మరోవైపు, 311 మంది భారతీయులను వెనక్కి పంపిన ఘటన పట్ల స్పందించిన అమెరికా భారతీయులను వెనక్కి పంపింన మాట నిజమేనని యూఎస్ కస్టమ్స్ అధికారి మోర్గన్ స్పష్టం చేశారు. మెక్సికోలో ఉండేందుకు డాక్యుమెంట్లు లేని కారణంగానే భారతీయులను వెనక్కి పంపినట్లు మోర్గన్ తెలిపారు. మానవ అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ఆయన హెచ్చరించారు..