రాజకీయం అంటే ప్రజల చుట్టూనే తిరుగుతుంది. నాయకులు తమకోసం ఏమైనా చేస్తారేమో అని జనం ఆశగా ఎదురు చూస్తుంటారు. ఆ ప్రజల మనసులు గెలుచుకున్నప్పుడు నాయకుల చేతికి అధికారం వస్తుంది. అయితే అధికారం చేతికి అందగానే ప్రజలకు ఇచ్చిన మాట గాల్లో కలసిపోకూడదు.. కానీ కొందరు నాయకులు అలా కాదు. పీఠం ఎక్కేవరకూ ఒక మాట. అందలం ఎక్కాక మరోమాట.
ప్రతిపక్షనేత చంద్రబాబు సీఎం జగన్ ను చూసి ఇదే నేర్చుకోవాలట. ఈ విషయం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్రెడ్డి అంటున్నారు. కళ్లబొల్లి మాటలు చెప్పే చంద్రబాబు ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనను చూసి నేర్చుకోవాలని సూచించారు. ఆయన తన వాదనకు రుజువులు కూడా చూపిస్తున్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి వైయస్ జగన్ చలిపోయారని, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారన్నారు.
వైఎస్ జగన్.. మగ్గం ఉన్న ప్రతి చేనేతకు రూ. 24 వేలు, ఇండస్ట్రీల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం తీసుకురావడం, ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ డ్రైవర్లకు రూ. 10 వేల ఆర్థికసాయం చేశారన్నారు. కార్మికులంతా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటారని సీఎం వైయస్ జగన్ పాలనపై అన్నివర్గాల ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని గౌతం రెడ్డి అంటున్నారు.
కార్మికులకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైయస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరుఫున రాష్ట్రమంతా కార్మికుల పక్షపాతిగా ఉన్న సీఎం వైయస్ జగన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయాలని గౌతమ్రెడ్డి పిలుపునిచ్చారు. కార్మికులందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అండగా ఉన్నారన్నారు. జగన్ ను చూసి చంద్రబాబు నేర్చుకోవాలని గౌతం రెడ్డి చెప్పడం బాగానే ఉంది. కానీ అప్పుడే ఈమాట అనడం కరెక్ట్ కాదేమో.. ఇంకా జగన్ అమలు చేయాల్సిన హామీలు చాలానే ఉన్నాయి కదా.