ఈ నెల 25న ఢిల్లీలో బీసీ కమిషన్ ముందు పూర్తి నివేదికతో హాజరుకావాలని ఆర్డర్ వేసింది. ఆర్టీసీ సమ్మెలో జోక్యం చేసుకోవాలని బీసీ కమిషన్ను ఆర్టీసీ జేఏసీ కోరింది. కార్మికుల్లో 20 వేలకు పైగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారని కార్మికులు బీసీ కమిషన్కు తెలిపారు. ఆర్టీసి కార్మికులు ఇచ్చిన బంద్ పిలుపు తెలంగాణలో హింసాత్మకంగా మారింది.
అరెస్టులతో బంద్ ను అణచి వేసేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు ప్రభుత్వం నుండి స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని పలు చోట్ల రాజకీయ నేతలతో పోలీసులు వాగ్వాదానికి దిగారు.సమ్మె చేయడం కార్మికుల హక్కు అని, సమ్మె చేస్తున్న కార్మికులను అరెస్టు చేయడం అంటే ఉద్యమాన్ని అణచి వేయడమేనని విమలక్క ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం తలపెట్టిన సమ్మె 15వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు జారీచేసింది. వారిద్దరూ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని బీసీ కమిషన్ ఆదేశించింది. ఆర్టీసీ జేఏసీ ఫిర్యాదుతో స్పందించిన బీసీ కమిషన్ సీఎస్, ఆర్టీసీ ఎండీకి నోటీసులు జారీ చేసింది.
ఆర్టీసీ కార్మికులు 26 డిమాండ్లతో 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం విధించిన గడువులోపు విధులకు చేరని వారు సెల్ఫ్ డిస్మిస్ అయిపోయినట్టేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారుల వద్ద వ్యాఖ్యానించారు. దీంతో ఆర్టీసీ కార్మికులు బీసీ కమిషన్ను ఆశ్రయించారు.