చేంజ్ వితిన్ పేరిట బాలీవుడ్ ప్రముఖులను, టీవీ నటులను ప్రధాని నరేంద్ర మోడీ కలుసుకోవడం పై మెగా కోడలు ఉపాసన కొణిదెల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు . ఈ కార్యక్రమానికి ఒక్క దక్షిణాది కళాకారుడి ని ఆహ్వానించక పోవడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు . దక్షిణాది చిత్ర పరిశ్రమను ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదని ఉపాసన ట్విట్టర్ వేదిక గా తన అసంతృప్తి వ్యక్తం చేశారు . దక్షిణాది చిత్ర పరిశ్రమ ను అనాదిగా చిన్నచూపు చూస్తున్న విషయం తెల్సిందేనని ఈ సందర్బంగా పలువురు పేర్కొంటున్నారు .
ట్విట్టర్ వేదికగా ఉపాసన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది . చేంజ్ వితిన్ పేరిట కేవలం బాలీవుడ్ అగ్ర హీరోలు షారుఖ్ ఖాన్ , అమీర్ ఖాన్, కంగనా రనౌత్ , జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పలువురు టీవీ నటులను ఆహ్వానించిన ప్రధాని , దక్షిణాది పరిశ్రమ కు చెందిన నటీ , నటులను ఆహ్వానించకపోవడం పట్ల సోషల్ మీడియా లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . దక్షిణాది ప్రజల పట్ల ఉత్తరాది వారు ఎప్పుడు వివక్ష చూపిస్తూనే ఉన్నారని అది ఒక్క సినిమా రంగానికే పరిమితం కాలేదని అంటున్నారు . గతం లో కొంతమంది కేంద్ర మంత్రులు సైతం దక్షిణాది వాటి పట్ల విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ఈ సందర్బంగా ప్రస్తావిస్తున్నారు .
చేంజ్ వితిన్ కార్యక్రమానికి ఇతర భాషల నటీ, నటులను ఆహ్వానించి దక్షిణాది వారిని ఆహ్వానించకపోతే తప్పుపట్టాలని , అంతేకాని దక్షిణాది వారి పట్ల వివక్ష చూపిస్తున్నారని ఆక్షేపించడం ఏమాత్రం సమంజసం కాదని మరికొందరు పేర్కొంటున్నారు . కేవలం బాలీవుడ్ నటీ, నటులను , హిందీ టీవీ సీరియల్స్ నటులను మాత్రమే ఈ కార్యక్రమానికి ప్రధాని ఆహ్వానించినట్లు స్పష్టం అవుతోందని అంటున్నారు .