ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసం సమీపంలో పేలుడు కలకలం సృష్టించింది. తాడేపల్లి లోని అయన నివాసానికి కొద్దిదూరంలో, ప్రకాష్ నగర్ లోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు లో ఓ మహిళకు గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఆ ఇంటి తలుపులు విరిగిపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టడానికి ముందే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి లో సొంతంగా భవనాన్ని నిర్మించుకున్నారు. ఇప్పుడు అదే భవనాన్ని, తన అధికారిక క్యాంపు కార్యాలయం, నివాసంగా కూడా వినియోగిస్తున్నారు.
ముఖ్యమంత్రి గా పదవి బాధ్యతలు చేపట్టిన కొత్తలో జగన్ మోహన్ రెడ్డి , తనని కలవడానికి వచ్చేవారని ఇంటిసమీపంలోనే కలుసుకునేవారు . అయితే కొంతమంది తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన దిగడం తో , భద్రతా కారణాల దృష్ట్యా , ముఖ్యమంత్రి ఎవర్ని కలువకుండా ఆంక్షలు విధించారు . సీఎం నివాస సమీపంలో ఉన్నట్టుండి పేలుడు జరగడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. పేలుడు లో గాయపడిన బాధితురాలు పైడమ్మ విజయవాడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆ ఇంట్లోని ప్రిజ్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు అంచనా వేశారు.
దీంతో పాటు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నారు. అయితే సీఎం ఇంటి సమీపం లో పేలుడు సంభవించడం తో , ఇదేమైనా సంఘ విద్రోహుల చర్య అయి ఉంటుందేమోనని తొలుత అనుమానించిన పోలీసులకు , ప్రిజ్ నుంచి గ్యాస్ నుంచి లీక్ కావడం వల్ల పేలుడు సంభవించిందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు . అయితే ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందా? అన్న కోణం లోను పోలీసులు విచారణ చేపట్టారు . పేలుడు లో గాయపడిన మహిళను ఎలా పేలుడు సంభవించిందో అడిగి తెలుసుకుంటున్నారు .