జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి కొత్త పథకాలు వస్తూనే ఉన్నాయి. ఆ దిశగా ఇంకో పథకం వస్తుంది అనేసి చెప్పాలి, వీలైనన్ని కొత్త పథకాలు మరియు ప్రజా ఆకర్షిత పథకాలను ప్రవేశపెట్టి తన పాలనను సుస్థిరం చేసుకోవాలని
జగన్ ఆరాట పడుతున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలోని జాతీయ రహదారులపై సంభవించే ప్రమాదాల్లో గాయపడ్డ వారికి అత్యవసర చికిత్స అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఈ రహదారులపై త్వరలో ‘డాక్టర్ వైఎస్సార్ రహదారి అత్యవసర చికిత్స కేంద్రాలు’ ఏర్పాటుచేయనుంది. రాష్ట్రం మీదుగా వెళ్లే అన్ని జాతీయ రహదారులపై ఈ హైవే ఎమర్జన్సీ క్లినిక్లకు శ్రీకారం చుడుతోంది.
రాష్ట్రంలో చెన్నై–కోల్కత, విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారులపై అత్యధికంగా ప్రమాదాల రేటు నమోదవుతోంది. వీటిపై గతంలో ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు కమిటీ ఆదేశించినా గత సర్కారు పెడచెవిన పెట్టింది. రాష్ట్రంలో మొత్తం 4,500 కి.మీ. మేర ఉన్న ఈ రహదారుల్లో ప్రతి 50 కి.మీ.కు ఒక హెచ్ఈసీ ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, రహదారి భద్రతపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇలా మొత్తం 90 క్లినిక్లు ప్రారంభించనున్నారు. ఒక్కో క్లినిక్కు రూ.80 లక్షలు చొప్పున మొత్తం 90 క్లినిక్లకు రూ.72 కోట్లు ఖర్చు చేయనున్నారు.
రోడ్డు ప్రమాదానికి గురైన గంటలోపు (గోల్డెన్ అవర్) ఆస్పత్రిలో చేరిస్తే బాధితుల ప్రాణాలు కాపాడే వీలుంది.కానీ, ట్రామాకేర్ ఆస్పత్రులలో సదుపాయాలు లేకపోవడంతో జనరల్ ఆస్పత్రుల్లో బాధితులు బెడ్లు లేక క్యాజువాలిటీలోనే గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి. ఇలా ఒక్కో జనరల్ ఆస్పత్రికి వస్తున్న కేసుల సంఖ్య రోజుకు ఎనిమిది నుంచి పది వరకు ఉంటున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో.. బాధితులకు
సత్వర వైద్యం అందించేందుకు వీలుగా వైఎస్సార్ రహదారి చికిత్స కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది.