సమస్యల పరిష్కారం కోరుతూ
ఆర్టీసీ కార్మికుల సమ్మె చిలికి చిలికి గాలివాన చందంగా తయారైంది. ఇప్పటికే ఈ సమ్మెకు ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు సైతం బాసటగా నిలిచారు. తాజాగా కేంద్రం కూడా ఈ సమ్మెకు అనుకూలంగా నిలుస్తున్నట్టుగా స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. ఈ విధంగా ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా అన్ని వైపులా నుంచి ఉచ్చు బిగిచుకుంటున్నట్లుగా పరిస్థితులు కానవస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్
ఢిల్లీ టూర్ మరింత ఆసక్తిని రేపుతోంది.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్కు ఢిల్లీ నుంచి పిలుపొచ్చి నట్టు సమాచారం .
మంగళవారం ఢిల్లీ వెళ్తున్న గవర్నర్ తమిళిసై.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారు. అనంతరం హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో తెలంగాణ భవన్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆర్టీసీ సమ్మె గురించి కేంద్రం గవర్నర్ను నివేదిక కోరినట్టు తెలుస్తోంది. అనేక విషయాలు చర్చకు రానున్నప్పటికీ.. ముఖ్యంగా
ఆర్టీసీ సమ్మె, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరే చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా
ఆర్టీసీ కార్మికులు తమంతట తామే ఉద్యోగాలను పోగొట్టుకున్నారన్న సీఎం కేసీఆర్ సమ్మె విషయంలో కాస్త మెత్తబడినట్టు కనిపిస్తున్నారు.
ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్పై ఇప్పటికే రెండుసార్లు విచారణ జరపగా.. మంగళవారం మరోసారి న్యాయస్థానంలో విచారణకు రానుంది. సమ్మె గురించి పూర్తి కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ సర్కారు పోలీసులకు సెలవులను రద్దు చేసింది.
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం.. పూర్తి స్థాయి సిబ్బంది అందుబాటులో ఉండేలా.. పోలీసుల సెలవులు రద్దు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి బస్ డిపో, బస్టాండుతో పాటు ప్రధాన ప్రాంతాల్లో పోలీస్ బలగాలు మోహరించి ఉన్నాయి. అక్టోబర్ 19న తెలంగాణ బంద్ నేపథ్యంలో సాధారణ ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.