ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సోమవారం చేపట్టిన సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతి భవన్‌ ముట్టడిని విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కార్మికులకు న్యాయం జరిగేదాకా పోరాడుతామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు హైదరాబాద్‌లో సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ నివాసంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ సభ్యుడు దయాసాగర్‌ సమావేశమై.. ప్రగతి భవన్‌ ముట్టడి వ్యూహంపై చర్చించారు.

అనంతరం షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ.. హైకోర్టు ఆదేశాలను సైతం కేసీఆర్‌ ధిక్కరిస్తున్నారని విమర్శించారు.కాంగ్రెస్‌ ఆందోళన నేపథ్యంలో ఆదివారం రాత్రే కాంగ్రెస్‌ కీలక నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేసే అవకాశాలున్నట్లు సమాచారం.   రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాలే కాకుండా వారు చేస్తున్న సమ్మెలో తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, ఆత్మగౌరవ పోరాటం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో, సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు కీలకంగా వ్యవహరించారన్నారు. 

వారి ఉద్యమంతో వచ్చిన తెలంగాణలో వారినే రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  దీంతో 50 వేల మంది కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆవేదన చెందుతున్నా యని, వారి ఆవేదన ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు.ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిరసనలో పాల్గొన్న సీపీఐ న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు గాయానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో సమ్మెకు మద్దతుగా నిరసనలో పాల్గొన్న రంగారావు బొటన వేలు తెగడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

సెల్ఫ్‌ డిస్మిస్‌ పేరుతో 50 వేల మంది ఉద్యోగులను రోడ్ల మీద పడేసిన సీఎం కేసీఆర్‌కు ఆర్టీసీ ఉద్యోగుల ఉసురు తగులుతుందని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఆర్టీసీలో సమ్మె చేసే పరిస్థితి రావడానికి కేసీఆరే కారణమన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: