మైనస్ ఉష్ణోగ్రతల్లో సైతం మన సైనికులు దేశ రక్షణకు ఎలా పహారా కాస్తున్నారో తెలుసుకోవాల‌ని చాలా మందికి ఆతృత ఉంటుంది. కానీ..అవ‌కాశం దొర‌క‌డం క‌ష్టం. కానీ కేంద్రం ఇప్పుడు ఆ చాన్స్ ఇస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధ క్షేత్రమైన సియాచిన్‌కు టూరిస్టుల‌ను అనుమ‌తించ‌నున్నారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న సియాచిన్.. సముద్ర మట్టానికి 11875 నుంచి 18875 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. గ‌డ్డకట్టే మంచు కొండల మధ్య మన సైనికులు నిత్యం పహారా కాసే చోటు.. కఠిన శిక్షణ పొందిన జవాన్లనే ముప్పతిప్పలు పెట్టే వాతావరణానికి నెలవు సియాచిన్‌. మైనస్ 18 నుంచి మైనస్ 60 డిగ్రీల కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రాంతంలోకి టూరిస్ట్‌ల‌కు ఓకే చెప్పేశారు.


ఈ మేర‌కు లఢఖ్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి రాజ్ నాథ్ ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు. పర్యాటకంగా లఢఖ్ వేగంగా అభివృద్ధి చెందుతోందని రాజ్ నాథ్ అన్నారు. ఏటా భారీ సంఖ్యలో టూరిస్టులు ఇక్కడికి వస్తున్నారని పేర్కొంటూ...ఇప్పడు సియాచిన్ వద్దకు చూడా పర్యాటకుల్ని అనుమతించాలని నిర్ణయించామన్నారు. సియాచిన్ బేస్ క్యాంప్ నుంచి కుమార్ సోస్ట్ వరకు టూరిస్టులు వెళ్లొచ్చని రాజ్ నాథ్ చెప్పారు. సాహస యాత్ర చేయాలన్న ఆశ ఉన్నోళ్లకు సియాచిన్ ఇక స్వాగతం పలుకుతుందని తెలిపారు. 


అత్యంత క్లిష్టమైన ఈ ప్రాంతంలో ఆర్మీ బేస్ వద్దకు చేరుకునే అవకాశాన్ని పర్యాటకులకు కల్పించాలని నిర్ణయం తీసుకోవడమే ఓ సాహసమని చెప్పాలి. ఇంత‌కీ ఎందుకు కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంది అంటే.... మైనస్ ఉష్ణోగ్రతల్లో సైతం మన సైనికులు దేశ రక్షణకు ఎలా పహారా కాస్తున్నారో సామాన్యులకు చూపించాలని కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చింది.  ఈ ప్రాంతానికి వెళ్లాలనుకునే యాత్రికులకు కఠిన శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే వారికి ఆర్మీ సాయం కూడా అందుతుందని స‌మాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: