జమ్మూకశ్మీర్లోని తంగ్దార్, కీరన్ సెక్టార్ల వద్ద భారత ఆర్మీ చేసిన ప్రతీకార దాడుల్లో పది మంది వరకు పాక్ జవాన్లు హతమైనట్లు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఆదివారం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ మిలిటరీ ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని భారత ఆర్మీ చీఫ్ చేసిన ప్రకటన నిరుత్సాహాపరుస్తున్నదని పాక్ గఫూర్ తెలిపారు. బిపిన్ రావత్ అవాస్తవ ప్రకటన చేశారని పేర్కొన్నారు.
భారత ఆర్మీ తెలిపిన వివరాల ప్రకారం...భారత సైన్యం దృష్టి మళ్లించేందుకు పాక్ సైన్యం సరిహద్దు ప్రాంతంలో కాల్పులకు దిగింది. కాల్పుల ముసుగులో ఉగ్రవాదులను సరిహద్దు దాటించే వ్యూహాన్ని పాక్ రచించింది. విషయం గ్రహించిన భారత్ సైన్యం పాక్ సైన్యాన్ని ధీటుగా తిప్పి కొట్టింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పాక్ సైనిక పోస్టులు, ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడి చేసింది. జురా, అతుమ్ ఖామ్, కుందల్ సాహిలో శతుఘ్నులతో భారత సైన్యం విరుచుకుపడింది. భారత్ దాడుల్లో పాక్ సైనికుల, ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్ లు ధ్యంసమయ్యాయి. ఈ దాడిలో దాదాపు 20 మంది ఉగ్రవాదులు హతమయినట్లు సమాచారం. పాక్ సైనికులు 6 నుంచి 10 మంది వరకు మరణించినట్లు పేర్కొంది.
అయితే,
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో మూడు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్లు భారత ఆర్మీ చేసిన ప్రకటనను
పాకిస్థాన్ మిలిటరీ కొట్టిపారేసింది. ఒకవేళ ఉగ్ర స్థావరాలు ధ్వంసం అయ్యింది నిజమే అయితే, ఆ ప్రాంతాలకు విదేశీ మీడియోను లేదా దౌత్యవేత్తలను తీసుకువెళ్లి చూపించాలని పాక్ మిలిటరీ ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ డిమాండ్ చేశారు. స్వదేశీ అవసరాల దృష్టానే రావత్ ఆ కామెంట్ చేశారని, ఇది ప్రొఫెషనల్ మిలిటరీ నైతికతకు వ్యతిరేమని గఫూర్ ఆరోపించారు. పాక్లో ఉన్న భారత ఎంబసీ అధికారులు.. క్యాంపు ప్రాంతాలను విజిట్ చేయవచ్చు అని అన్నారు. ఈ నేపథ్యంలో...పాక్ అబద్దం చెప్తోందా లేకపోతే...భారత్ నిజం చెప్పలేదా అనే సందేహం సహజంగానే వ్యక్తమవుతోంది.