రాష్ట్రంలో జగన్ పాలన ఎలా ఉంది? రాష్ట్రంలో ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా.. ఏ ఇద్దరు రాజకీయ నేతలు కలిసినా.. ఇదే విషయంపై చర్చ సాగుతుండడం గమనార్హం. అయితే, ఇలా చర్చ సాగుతుండడానికి కూడా రీజన్ ఉంది. జగన్ పాలన సైలెంట్గా సాగిపోతోంది. ఎక్కడా మీడియా మీటింగులతో హడావుడి చేయడం కానీ, ప్రచార ఆర్భాటాలకు పోవడంకానీ, ఉన్నదీ లేనిదీ తనదే అని డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేయడం కానీ ఏమీ లేదు. గంటల తరబడి సమీక్షలు అస్సలే లేవు. చెప్పాలనుకున్నది సూటిగా చెప్పడం, చేయాలని అనుకున్నది సమయానికి చేసేయడం.. ఇదీ జగన్ శైలి. దీనినే ఆయన పాలనలోనూ చచూపిస్తున్నారు. దీంతో జగన్ పాలనపై పెద్దగా రాష్ట్రంలో ప్రత్యేక హడావుడి అంటూ ఏమీ కనిపించడం లేదు.
ఇదే సమయంలో పాలనను పక్కన పెడితే.. తన బృందంలోని అటు మంత్రుల విషయంలోను, ఇటు ఎమ్మెల్యేల విషయంలోనూ జగన్ ఎలాంటి హడావుడీ చేయక పోవడం గమనార్హం. అంటే.. మంత్రుల పనితీరుపై నివేదికలు తెప్పించుకోవడం, ఎమ్మెల్యేల పనితీరుపై నిఘా ఏర్పాటు చేశానని చెప్పడం.. ఇంటిలిజెన్స్ను పార్టీ కోసం వినియోగించడం వంటి చర్యలు ఎక్కడా జగన్ పాలనలోమనకు కనిపించడం లేదు. దీంతో రాష్ట్రంలో జగన్ పాలనపై చర్చ జరుగుతోంది.
వైసీపీ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టి.. ఐదు మాసాలు పూర్తయ్యాయి. ఈ ఐదు మాసాల కాలంలో ఎక్కడా జగన్ కానీ, పార్టీలోని కీలక నాయకులు కానీ.. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు వస్తున్నాయని కానీ, పనితీరును బేరీజు వేస్తున్నామని కానీ ప్రకటించలేదు.
కానీ, అంతర్గతంగా చూస్తే.. మాత్రం జగన్ తాను ఎలాంటి పాలన అందించాలని భావిస్తున్నారో.. తన టీం ఎలా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారో.. అలాగే.. ఆయన దూసుకుపోతున్నారు. తాను చేసే ప్రతిపనికీ డబ్బా కొట్టుకోవాలని కూడా అనుకోవడం లేదు. అదేసమయంలో తాను అమలు చేస్తున్న ప్రతి పథకం ప్రజల నోళ్లపై నానాలని, మౌత్ పబ్లిసిటీ జరిగితే చాలని కోరుకుంటున్నారు.
ఇక, ఈ క్రమంలోనే ఆయన ప్రతిపక్షాలు గుప్పిస్తున్న అర్ధం లేని విమర్శలపై కూడా పెద్దగా దృష్టి పెట్టడం లేదు. వాస్తవానికి ఏ ప్రభుత్వమైనా.. ప్రతిపక్షాలు చేసే విమర్శలను ఫైల్ చేయడానికి అంతర్గతంగా ఓ వింగ్ను ఏర్పాటు చేసుకుంటుంది. ఆయా విమర్శలకు రోజూ స్పందించడం, తిప్పికొట్టడం కామనే.
అయితే, జగన్ మాత్రం ఇలాంటివింగ్ను ఎక్కడా ఏర్పాటు చేసుకోకపోగా.. అసలు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన పెద్దగా పట్టించుకోవడంలేదు. అన్నింటినీ ప్రజలకే వదిలేస్తున్నారు. దీంతో జగన్ పాలన చాలా డిఫరెంట్గా ఉంది గురూ.! అని గత చంద్రబాబు పాలన గురించి తెలిసిన రాజకీయ అనుభవజ్ఞులు అంటుండడం గమనార్హం. ఇదిలావుంటే,
వైసీపీ మంత్రుల్లోనూ జగన్ పట్టించుకోనంత మాత్రాన విచ్చలవిడితనం పెరిగిపోయిందని అనుకుంటే పొరపాటే.. ఇటీవల మంత్రి పుష్పశ్రీవాణి చెప్పినట్టు.. మేం ఏ పనిచేస్తున్నా.. మా సమక్షంలో జగన్ ఉన్నారనే భావిస్తున్నాం. ఆయన కనుసన్నల్లోనే నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ఫీలవుతాం! అనేది వాస్తవం.
మంత్రుల్లో అంతా సమష్టి తత్వం.. అధినేతపై గౌరవం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది తప్పితే.. వారిని నివేదికలు, ఇంటిలిజె్న్స్.. అంటూ.. బెదిరించడం వల్ల సాధించేది ఏముంటుందని ఈ విషయం తెలిసిన సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. సో.. పాలనలో తనదైన ముద్ర వేస్తున్న జగన్కు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయన్నమాట.