కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆయనకు బెయిల్ లభించింది. కానీ ఈ నెల 24 వరకు ఆయన ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి సుప్రీ కోర్టులో ఊరట లభించింది. సెప్టెంబర్ 5 నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆయనకు మంగళవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసులో లక్ష రూపాయల పూచికత్తు మీద ఆయనకు బెయిల్ దొరికింది. ఆగస్టు 21న సీబీఐ చిదంబరాన్ని అరెస్టు చేసింది. గత వారం చివరి వరకు ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. ఆ తరువాత ఆయనను ఈడీ కస్టడీకి అప్పగించారు. సీబీఐ కేసులో బెయిల్ దొరికినా, అక్టోబర్ 24 వరకు చిదంబరం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కస్టడీలోనే ఉండనున్నారు. ఢిల్లీలోని తీహార్ జైల్లో నెల రోజులకుపైగా ఉన్న చిదంబరాన్ని గత వారం ఈడీ కస్టడీలోకి తీసుకుంది. ఈడీ కస్టడీ ముగిసిన అనంతరం చిదంబరాన్ని రిమాండ్‌ కు తరలించనున్నారు. ఈడీ కేసులోనూ బెయిల్ వస్తేనే ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు.


మరోవైపు చిదంబరంపై సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌ షీట్‌ పై ఢిల్లీ కోర్టులో విచారణ జరిగింది. ఈ నెల24న చిదంబరాన్ని కోర్టు ముందు హాజరు పర్చాల్చిందిగా అధికారులను ఆదేశించింది ధర్మాసనం. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగతా వారికి కూడా నోటీసులు పంపింది. మరోపక్క ఇక ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తి చిదంబరం, పీటర్ ముఖర్జియాలతోపాటు ఇతర నిందితులకు రౌజ్ ఎవెన్యూ కాంప్లెక్స్ లోని ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రంపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.


అయితే, ఈడీ కస్టడీలో ఉన్న చిదంబరానికి ఇంటి నుంచి ఆహారం తెప్పించడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రత్యేక సెల్, వెస్ట్రన్ టాయిలెట్, కళ్లద్దాలు, మందులు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. ఏసీ సౌకర్యం కల్పించాలని చిదంబరం చేసుకున్న వినతికి ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రోజుకు అరగంట చొప్పున కుటుంబ సభ్యులు, బంధువులను కలిసే అవకాశం ఆయనకు కల్పిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాదాపు రెండు నెలలుగా చిదంబరం ఈడీ, కోర్టు కేసుల మధ్య నలుగుతున్నారు.అటు-ఆయన తనయుడు కార్తీ చిదంబరం కూడా ఇవే కేసులను ఎదుర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: