ఆంధ్రప్రదేశ్ లో ఇంఛార్జ్ మంత్రుల సమూల ప్రక్షాళన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది . ఒక్క మేకపాటి గౌతమ్ రెడ్డి ని మినహాయించి , గతం లో జిల్లా ఇంచార్జ్ మంత్రులుగా నియమించిన వారందర్ని తప్పించడం వెనుక అసలు కారణం ఏమిటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల వ్యవధిలోనే జిల్లా ఇన్చార్జి మంత్రులను సమూలంగా ప్రక్షాళన చేయడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో సంచలనానికి తెర తీశారు .
అయితే 13 జిల్లాలకు నూతన ఇన్చార్జ్ మంత్రులను నియమించిన జగన్ , ఒక్క మహిళ మంత్రిని కూడా జిల్లా ఇంచార్జ్ మంత్రిగా నియమించకపోవడం విమర్శలకు తావిస్తోంది . ఇక ఏ ఒక్క ఉప ముఖ్యమంత్రికి కూడా జిల్లా ఇంచార్జ్ మంత్రి పదవి హోదా దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది . జిల్లా ఇంచార్జ్ మంత్రులను మార్చడం వెనుక వారి పై వెల్లువెత్తుతున్న ఆరోపణలు కారణమని తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా తన కేబినెట్ సహచరులు పై వస్తున్న ఆరోపణల దృష్ట్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారన్న వాదనలు లేకపోలేదు . సీనియర్, జూనియర్ అన్న తేడా లేకుండా పలువురిపై ఆరోపణలు వెల్లువెత్తడంతో, జిల్లా ఇంచార్జ్ మంత్రుల సమూల ప్రక్షాళన కు జగన్ నడుంబిగించారని తెలుస్తోంది . ఇక మంత్రుల పై వెల్లువెత్తుతున్న ఆరోపణలు తో పాటు, త్వరలోనే జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని ఉద్దేశంతోనే, జిల్లా ఇంచార్జ్ మంత్రులను సమూలంగా జగన్ మార్చినట్టు గా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వివిధ జిల్లాలకు గతంలో ఇన్చార్జి మంత్రులు గా నియమించిన వారు, ఆ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పార్టీ నేతలను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లడం వల్ల విఫలమయ్యారన్న విమర్శలు నేపధ్యం లో వారిని తప్పించి కొత్తవారికి అవకాశం ఇచ్చారని అంటున్నారు .