స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల ఇండెంట్పై అనాసక్తి కనబరుస్తోంది. నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల డిమాండ్ ఉన్నప్పటికీ నాసిక్ ముద్రణాలయానికి ఇండెంట్ పెట్టకపోవడం వెనుక కొత్త వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.
స్థిరాస్తుల రిజిస్ట్రేషన్, ఒప్పం దాలు, ధ్రువీకరణలు, న్యాయపరమైన లావాదేవీలకు అత్యధికంగా వినియోగించే రూ.100లు విలువ గల స్టాంప్ పేపర్ల పంపిణీ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి నిలిచిపోయింది.ఇప్పటికే రూ.50ల విలువగల నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు పత్తాలేకుండా పోగా, తాజాగా రూ.100ల స్టాంప్ పేపర్లు సైతం అదే జాబితాలో చేరుతున్నట్లు కనిపిస్తోంది.
రిజిస్ట్రేషన్ శాఖ నుంచి కేవలం రూ.20ల స్టాంప్ పేపర్లు మాత్రమే పంపిణీ జరుగుతోంది. దీంతో స్థిరాస్తి దస్తావేజులు మినహా మిగిలిన అన్ని లావాదేవీలు వీటిపైనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నాసిక్ ముద్రణాలయానికి అవసరమైనంత ఇండెంట్ పంపించి నాన్ జ్యుడీషియల్ స్టాంప్లను తెప్పిస్తోంది. ప్రతిసారి ముందస్తుగా 20 శాతం వరకు సరుకు నిల్వ చేసి మిగితాది జిల్లా రిజిస్ట్రార్ సరఫరా చేస్తోంది. జిల్లా రిజిస్టార్ ఆఫీస్ కూడా స్టాంప్ డిపోలో కొంత స్టాక్ రిజర్వ్డ్ చేసుకొని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ఇండెంట్ డిమాండ్ మేరకు పంపిణీ చేస్తోంది.